సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 8: విద్యార్థులు పుస్తకాలను చదవడంతోపాటు వాటిలోని అం శాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం స్థానిక సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకిత్తిస్తాయన్నారు. విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్న క్రమంలో బట్టి పద్ధతిని వీడాలని సూచించారు. పుస్తకాలు చదవడం, రాయడం మాత్రమే కాకుం డా అందులోని విషయ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తాను కూడా చిన్నతనంలో ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న సందర్భాన్ని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 761 ఎగ్జిబిట్లు నమోదు కాగా, ఆ సంఖ్య 800లకుపైగా దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎగ్జిబిట్లను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు వినూత్న తరహాలో రూపొందించిన వివిధ ప్రదర్శనలను కలెక్టర్ తిలకించారు. ఆయా ఎగ్జిబిట్లను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి విజయ్కుమార్, సెయింట్ ఆంథోనీఎస్ పాఠశాల కరెస్పాండెంట్ సలోమాన్రెడ్డి, మండల విద్యాధికారి వెంకట నర్సింహులు, వివిధ కమిటీల కన్వీనర్లు, విద్యార్థులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.