సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 10: సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీకి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంగారెడ్డి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 8,654 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు లైజన్ అధికారులను నియమించామన్నారు. వీరు చీఫ్ సూపరింటెండెండ్తో పాటు పరీక్షా కేంద్రంలో ఉండి సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులకు తెలిసేలా పరీక్షా కేంద్రం పేరు, పేపర్ కోడ్, ఏరియా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విధిగా ప్రదర్శించాలన్నారు. హాల్ టికెట్పై అభ్యర్థుల ఫొటో మిస్సయితే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని సూచించారు. ఇన్విజిలేటర్లు సరైన సమయానికి పేపర్ ఇవ్వాలని, సమయం పూర్తి కాగానే తీసుకోవాలని ఆదేశించారు. ఉర్దూ, తెలుగు మాధ్యమాల అభ్యర్థులకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఐవో గోవింగ్రామ్, డీఈవో వెంకటేశ్వర్లు, డీఆర్వో నగేశ్, డీఎస్పీ రవీందర్రెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: నేడు నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 3,293 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇందులో మెదక్లో 4, నర్సాపూర్లో 1, తూప్రాన్లో 2 కేంద్రాలున్నాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనున్నది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 10.15 గంటల వరకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 10.15 గంటల తరువాత అనుమతి లేదని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు చెప్పులతో మాత్రమే పరీక్ష హాలుకు రావాలని, షూస్కు అనుమతి లేదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, వ్యాట్, బెల్ట్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం గేట్ బయటే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు.