నర్సాపూర్, మే 3: జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నారాయణపూర్లో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, రికార్డులు, కండ్లద్దాల పంపిణీ తదితర వాటిని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. దృష్టి లోపం ఉంటే కండ్లద్దాలు తీసుకోవాలని, లేకుంటే చూపు మందగించే ప్రమాదం ఉందన్నారు. రోజు లక్ష్యం మేరకు కంటి పరీక్షలు చేయాలని, అవసరమున్న వారికి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో 41 వైద్య బృందాలతో 68 రోజులుగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 373 పంచాయతీలు, 65 వార్డుల్లో ఈ శిబిరాలు నిర్వహించి 3,73,358 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. 40,853 మందికి రీడింగ్, 33,045 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 25 పంచాయతీలు, 4 మున్సిపల్ వార్డుల్లో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. కంటి వెలుగు శిబిరాలు జూన్ 15 వరకు కొనసాగుతాయన్నారు.
అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేత
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. లింగాపూర్లోని అంగన్వాడీని కలెక్టర్ సందర్శించారు. గర్భిణులకు ఆరోగ్య లక్ష్మి పథకంలో భాగంగా ఒక పూట భోజనం పెడుతున్నామన్నారు. విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రీషన్ డే కింద మొదటి న్యూట్రీషన్లో భాగంగా బుధ, శనివారాల్లో అంగన్వాడీల్లో పిల్లల ఎత్తు, బరువులు పరీక్షించి తీవ్ర పోషక లోపం, వయస్సుకు తగ్గ ఎత్తు బరువు లోపం ఉన్న పిల్లలను గుర్తించి గుడ్లు, బాలామృతం అందిస్తున్నామన్నారు. రెండో న్యూట్రీషన్లో భాగంగా వైద్యాధికారుల సహకారంతో గర్భిణులు, బాలింతలు, చంటి పిల్లలకు టీకాలు వేసేలా చూస్తున్నామన్నామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు, అంగన్వాడీలు, సూపర్వైజర్ల సమన్వయంతో పని చేస్తూ హై రిస్క్తో బాధపడుతున్న గర్భిణులు, పిల్లల ఆరోగ్య విషయంలో సమయం ప్రకారం వైద్య సౌకర్యాలు అందించేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.చందునాయక్, డిఫ్యూటీ డీఎమ్హెచ్వో విజయనిర్మల, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, అంగన్వాడీ సూపర్వైజర్లు, పీహెచ్పీ డాక్టర్, ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.