సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 24: సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ప్రశ్నాపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరే వరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం సంగారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్, మార్చి 14న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధితశాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించామన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు, డీఈవో వెంకటేశ్వర్లు, డీఐఈవో గోవింద్ రామ్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీటీవో కవిత, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వసంత్రావు, ఆర్టీసీ, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.