మెదక్, జూలై 17(నమస్తే తెలం గాణ): జూలై 17: ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలుసాగు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. శుక్రవారం మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ పంటలకే పరిమితం కాకూడని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. వర్షాభావాన్ని తట్టుకునే విధంగా మిల్లెట్స్, కూరగాయలు, పప్పుదినుసులు, పామాయిల్ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తక్కువ రోజుల్లో చేతికొచ్చే పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకునేందుకు బిందు, తుంపర సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. బోరుబావుల ద్వారా వరి సాగుచేయవద్దని సూచించారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు తగ్గి నీటి కొరత ఏర్పడి పంట నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కూరగాయల సాగుకు ప్రభు త్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదన్నారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో అంబాదాస్, రాజేశ్వర్, మెదక్ జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్సింగ్ పాల్గొన్నారు.