సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 4: అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమన్నారు.
అధికారులు ప్రత్యేక చొరవ చూపి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లపై 46 దరఖాస్తులు వచ్చా యన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.