సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 19 : జిల్లాలో ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం షెడ్యూల్ సిద్ధ్దం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చే సమయంలో వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. మాక్పోల్ నిర్వహణ, ఈవీఎం ఆపరేట్ చేయడం, ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలను, ప్రీ పోల్, పోలింగ్ తర్వాత చేయాల్సిన పనులు చెప్పాలన్నారు. రిటర్నింగ్ అధికారి స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వాలని ఆర్వోలకు సూచించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణకు సంబంధించిన షెడ్యూలు సిద్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. డీఆర్వో నగేశ్, మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సీజ్ చేసిన నగదు విడుదలకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రీవెన్స్ కమిటీలో నోడల్ అధికారిగా డీసీవో తుమ్మ ప్రసాద్, సభ్యులుగా డీటీవో కవిత, డీఆర్డీవో శ్రీనివాసరావును నియమించినట్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేల కంటే మించి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న, రవాణా చేస్తున్న నగదు సీజ్ చేస్తున్నామన్నారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించి సదరు వ్యక్తులు పూర్తి ఆధారాలతో జిల్లా గ్రీవెన్స్ కమిటీలో సమర్పిస్తే, కమిటీ పరిశీలించి నగదును విడుదల చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ అధికారులను 910011 5691, 9281487272, 7799934135 నెం బర్లపై సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 19 : జిల్లాలో స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్ అవేర్నెస్ ఫోరాలు ఏర్పాటు చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్వీప్ యాక్షన్ ప్లాన్పై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, పరిశ్రమల్లో ఓటర్ అవేర్నెస్ ఫోరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ఏరియాల్లో ప్రతి సంస్థలో పనిచేస్తున్న అధికారులలో ఒకరిని నోడల్ అధికారిగా నియమించి ఓటు వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామం, మండల నియోజకవర్గం, మున్సిపాలిటీ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు వేయాలన్నారు. ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం స్థాయిలో చునావ్ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్ టర్న్ అవుట్ తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఓటు వేయడంపై ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు, మహిళలకు రంగో లీ పోటీలు నిర్వహించాలని సూచించారు. రైతు లు, థర్డ్ జెండర్, యువత, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు ఓటు హక్కు వినియోగం, ఈవీఎంపై అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి అఖిలేష్రెడ్డి, డీఆర్వో నగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.