సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 25: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు.
5 జనవరి 2023 నాటికి రూపొందించిన ఓటరు జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 47,908 మందిని తొలగించినట్లు వెల్లడించారు. అందులో 11,206 మంది మరణించిన వారు ఉండగా 2,986 మంది మరో బూత్కు షిఫ్ట్ అయినవారు ఉన్నారని, 33,716 మందిని రిపీటెడ్ ఓటర్లుగా గుర్తించి తొలిగించినట్లు తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధ్రువీకరించనున్నట్లు పేర్కొన్నారు.