సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 20 : జిల్లాలోని న్యాల్కల్ మండలం రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 22తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులు, జహీరాబాద్ డివిజన్ అధికారులతో కుంభమేళా ఏర్పాట్ల పురోగతిపై జిల్లా ఎస్పీ రమణకుమార్తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జరుగనున్న కుంభమేళాకు వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చే సాధువులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు. కుంభమేళాకు వచ్చే మార్గంతో పాటు నది తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. మంజీరా నదిలో భక్తుల కోసం స్నానఘట్టాలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా షవర్స్ ఏర్పాటు చేయాలన్నారు. బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లు, 24 గంటల నీటి సరఫరా ఉండాలన్నా రు. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చలివేంద్రా లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. షిఫ్టుల వారీగా పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ బాగుండేలా చర్యలు తీసుకోవాలని డీపీవోకు సూచించారు. ట్రాలీలు, ట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ జరిగేలా చూడాలన్నారు.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కుంభమేళాకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపించాలని సూచించారు. అవసరమైతే అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ ఆర్ఎమ్కు సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాన గజ ఈతగాళ్లను బోట్లతో సహా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్టీసీ, పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ, నీటిపారుదల, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, మత్య్స శాఖల అధికారులు, ఆర్డీవో, డీఎస్పీలు, మండల తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.