‘జియోటెక్స్టైల్’ టెక్నాలజీతో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
కొబ్బరి పీచుతో తయారుచేసిన మ్యాట్(కాయిర్) వేసి బీటీ రహదారి నిర్మాణం
జిల్లాలో మొదటిసారిగా హుస్నాబాద్లో ప్రారంభం
పోతారం(ఎస్) నుంచి నాగారం మీదుగా ఉమ్మాపూర్ వరకు 3.64 కి.మీ రోడ్డు నిర్మాణం
కొత్త విధానంతో ఖర్చు తక్కువంటున్న అధికారులు
కొబ్బరిపీచు, జౌళితో తయారుచేసిన మ్యాట్(కాయిర్)ను ఉపయోగించి ‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్ల నిర్మాణం చేసే నూతన విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానం ద్వారా జిల్లాలోనే మొదటిసారి హుస్నాబాద్ మండలంలో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) నుంచి నాగారం మీదుగా ఉమ్మాపూర్ వరకు 3.64 కిలోమీటర్ల మేర ఈ కొత్త విధానంతో రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు రూ.2.31 కోట్లు మంజూరు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లనిర్మాణం ఈ పద్ధతి ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో రోడ్లు నాణ్యతగా ఉండడంతో పాటు నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుస్నాబాద్ మండలంలో మూడు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
హుస్నాబాద్, జూన్ 24 : కొబ్బరిపీచు, జౌళితో తయారు చేసిన మ్యాట్ (కాయిర్)ను ఉపయోగించి ‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్ల నిర్మాణం చేసే నూతన విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానం ద్వారా జిల్లాలోనే మొదటిసారి హుస్నాబాద్ మండలంలో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) నుంచి నాగారం మీదుగా ఉమ్మాపూర్ గ్రామం వరకు 3.64 కిలోమీటర్ల మేర ఈ కొత్త విధానంతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు రూ.2.31 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాం తాల్లో లింకు రోడ్లనిర్మాణం ఈ పద్ధతి ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మారుమూల గ్రామాలను కలుపుతూ కొత్త సాంకేతిక విధానంతో రోడ్లు నిర్మిస్తున్నారు. దేశంలోని పలు రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఈ విధానంలో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు.
పర్యావరణ హితం..
‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’తో నిర్మించే రోడ్లు నాణ్యతగా ఉండడంతో పాటు నిర్మాణం వ్యయం చాలా తక్కువగా ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రోడ్లను జియోటెక్స్టైల్ విధానం(కొబ్బరి పీచు, జౌళి)తో నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో 1,674 కి.మీల మేర రోడ్ల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణలో 121 కిలోమీటర్ల మేర రహదారులను ఈ కొత్త విధా నం ద్వారా నిర్మించాలని నిర్ణయించారు. ఈ విధానంతో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోడ్లను నిర్మించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో మూడు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. జనం ఆసక్తిగా రోడ్డు పనులను తిలకిస్తున్నారు.
రోడ్డు నిర్మాణం ఎలా చేస్తారంటే..
‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్డు నిర్మాణానికి గాను మొదట రోడ్డుపై మొరం పోసి రోలింగ్ చేస్తారు. అనంతరం రోడ్డుపై కొబ్బరి పీచుతో తయారు చేసిన కాయిర్ (మ్యాట్)ను అమర్చుతారు. దానిపై గ్రాన్యులర్ సబ్బేస్ (కంకర డస్ట్) వేసి రోలింగ్ చేస్తారు. అనంతరం వెడ్ మిక్స్(40ఎంఎం, 20ఎంఎం, 12ఎంఎం, 4ఎంఎం చిప్స్, డస్ట్ కలిపి)వేసి మళ్లీ రోలింగ్ చేస్తారు. ఆ తర్వాత బీటీ రోడ్డు వేస్తారు. సాధారణంగా రోడ్డు వేస్తే సుమారు 7 ఇంచుల మందంతో వేయాల్సి ఉంటుంది. కానీ, కొత్త టెక్నాలజీతో కేవలం 5ఇంచుల ఎత్తు మాత్రమే వేస్తారు. తద్వారా ఖర్చు ఆదా అవుతుంది. మొరంపై వేసిన కాయిర్ కొన్ని రోజుల వరకు బీటీకీ నీటిని అంటకుండా అడ్డుకుంటుంది. దీంతో బీటీ రోడ్డు అంత తొందరగా దెబ్బతినే అవకాశం ఉండదు. తదనంతరం కొబ్బరి పీచు కాయిర్ మట్టిలో కలిసిపోయినప్పటికీ మొరానికి బీటీకి మధ్య గట్టిదనం ఏర్పడి రోడ్డు నాణ్యతగా ఎక్కువ రోజులు ఉంటుందని అధికారులు విరిస్తున్నారు.
పనులు నాణ్యతతో చేయిస్తున్నం..
రోడ్డు పనులను నాణ్యతతో చేయిస్తున్నాం. 3.64 కి.మీ మేర కొబ్బరిపీచు మ్యాట్ వేసి నిర్మాణం ప్రారంభించాం. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాం. పలుచోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానంలో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రజలు రోడ్డు నిర్మాణ పనులను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందని భావిస్తున్నా.
-సదాశివరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (పీఆర్), హుస్నాబాద్
కొత్త విధానంతో ఖర్చు తగ్గుతుంది..
జియోటెక్స్టైల్ విధానంతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఖర్చు చాలా తగ్గుతున్నది. ఇందులో సిమెంటు వాడకం లేదు. కొబ్బరిపీచుతో తయారు చేసిన మ్యాట్ను మట్టితో రోలింగ్ చేసిన రోడ్డుపై వేసి దానిపై రెండు లేయర్ల్ల డస్ట్, వివిధ సైజుల్లో కంకర వేసి రోలింగ్ చేసిన అనంతరం నేరుగా బీటీ వేస్తాం. దీనిద్వారా రోడ్డుపై పడిన నీరు ఇరువైపులా పడిపోయి భూమిలోపలికి ఇంకిపోయి రోడ్డు దెబ్బతినకుండా కొబ్బరి పీచు మ్యాట్ కాపాడుతుందని టెక్నీషియన్లు చెబుతున్నారు.
– స్నేహ, పంచాయతీరాజ్ ఏఈ, హుస్నాబాద్