తూప్రాన్, నవంబర్ 19 : రైతులకు మూడు గంటల కరెంటు కావాలా.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి మూడు పంటలు కొనే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు విద్యాసాగర్ అన్నారు. తూప్రాన్ మండలం వట్టూరు, నాగులపల్లి, దాతర్పల్లి, వెంకటరత్నాపూర్, ఇస్లాంపూర్ గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో గ్రామస్తులు, మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లాల దగ్గర కొత్త బిచ్చగాళ్లు వచ్చినట్లు ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని, వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అరవై ఏండ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలకు పెంచిన ఘనత ఒక్క బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న వెంకటేశ్ యాదవ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు వెంకటరాంరెడ్డి, సుకన్య రమేశ్, నర్సమ్మ, భగవాన్రెడ్డి, జనమ్మ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.