నర్సాపూర్, ఏప్రిల్ 15: బీఆర్ఎస్లో నర్సాపూర్ నియోజకవర్గాన్నే శాసించిన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి నేడు అవమానాలు తప్పడం లేదు. బీఆర్ఎస్లో ఉండగా ఉన్న గౌరవం, పెద్దరికం, హుందాతనం కనుమరుగైంది. కాంగ్రెస్లో చేరుతున్నారనే సంకేతాలు వెలువడినప్పటి నుంచి అందరూ ప్రేమతో పిలుచుకునే మదన్రెడ్డికి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవినీతి, అక్రమార్కుల మాటలు విని బీఆర్ఎస్ను దూరం చేసుకొని చులకన అయ్యాడని పలువురు నాయకులు చర్చించుకుంటున్నా రు. కొందరు నాయకులు వారి తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మదన్రెడ్డిని కాంగ్రెస్లో చేరాలనే ఒత్తిడి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఏప్రిల్ 5 లేదా 6న కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగింది అయినా చేరలేదు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతానని అనుచరులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వెళ్లారు. సీఎం ఇంటికి చేరుకోగానే సీఎం బిజీగా ఉన్నారు… గాంధీ భవన్లో దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో చేరికలు ఉన్నాయని అక్కడి వారు చెప్పడంతో చేసేది లేక గాంధీభవన్కు పయనమయ్యారు.
ఇదే సమయంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహ్మద్, రవీందర్రెడ్డి ముఖ్యమంత్రి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పైగా సీఎం రేవంత్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీభవన్ వెళ్లేసరికి అక్కడ దీపాదాస్ మున్షీ లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే నారాజ్ అయ్యాడని ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి గౌరవం దక్కుతుందోనని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని అవమానాలు పడుతూ నర్సాపూర్ ఆత్మగౌరవాన్ని గాంధీభవన్లో తాకట్టుపెట్టారని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను తీసుకెళ్లి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతానని పెద్దాయన చెప్పినప్పటికీ… కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుకున్నంత స్పందన లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డికి ఆ పార్టీలో గౌరవమర్యాదలు దక్కుతాయా లేదా అనేది మున్ముందు చూడాలి.