మెదక్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ఇకడి ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజల చెంతకు చేర్చాలనే ఉద్దేశంతో జిల్లాను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని ఎంపిక చేసి టెండర్ పిలిచి కాంట్రాక్టర్కు పనులు అప్పగించింది. నిర్మాణ పనులన్నీ పూర్తి కాగా, ఈనెల 19న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో పర్యటన 23వ తేదీకి వాయిదా పడింది. దీంతో బుధవారం సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.
లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్
సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి 32 ఎకరాలు కేటాయించగా, ఇందులో లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన భవనాన్ని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 50వేల చదరపు అడుగులు, మొదటి అంతస్తు 50వేల చదరపు అడుగులు, రెండో అంతస్తు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ సముదాయంలో ఒక మీటింగ్ హాల్, మూడు కాన్ఫరెన్స్ హాల్స్, ఒక వెయిటింగ్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. కార్యాలయాలకు సంబంధించి ఫర్నిచర్ కొనుగోలు పూర్తయింది. ఆయా కార్యాలయాల్లో వాటిని అమర్చే పనులు కొనసాగుతున్నాయి. మంచి నీటి సౌకర్యం కోసం పలు చోట్ల కుళాయిలతోపాటు 80 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.
32 ఎకరాల్లో… రూ.67.07 కోట్లతో…
మెదక్ జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ శివారులో 32 ఎకరాల స్థలంలో సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. భవన నిర్మాణానికి రూ. 67.07 కోట్లు కేటాయించగా, నిర్మాణ పనులను టెండర్ పద్ధతిలో చాబ్రా అసోసియేట్స్కి అప్పగించింది ప్రభుత్వం. 2018 మే 9న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ను జీ ప్లస్ -2 పద్ధతిలో నాలుగు బ్లాకులుగా నిర్మించారు. ఇందులో కలెక్టర్ బంగ్లాతో పాటు రెండు అడిషనల్ కలెక్టర్, 8 మంది జిల్లా అధికారుల నివాస గృహాలు ఉన్నాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంతో పాటు మిగిలిన అధికారుల నివాస గృహాలు పనులు కూడా పూర్తయ్యాయి. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఇతర అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పూర్తిచేయగా, నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు.
కలెక్టరేట్లో పూర్తయిన పనులు
సమీకృత కలెక్టరేట్ సిద్ధమైంది. గదులకు రంగులు, కిటికీలు, తలుపులు బిగించడంతోపాటు విద్యుత్ వైరింగ్ పనులు పూర్తికాగా, గదుల్లో ఫ్యాన్లు, ఏసీలను అమర్చారు. రెండు లిఫ్ట్ల పనులు కూడా పూర్తయ్యాయి. కార్యాలయం విద్యుత్ సరఫరాకు సమీపంలో 315 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏర్పాటు చేశారు. భవనం ఆవరణలో గార్డెనింగ్ పనులు పూర్తయ్యాయి. పూల మొకలతోపాటు వాటర్ ఫౌంటెయిన్, పచ్చిగడ్డి ఏర్పాటు చేశారు. వాహనాల పారింగ్తో చుట్టూ అంతర్గత రహదారులు నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తి కాగా, దానికి ఆనుకుని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నాలుగు వరుసలతో దాదాపు 330 మీటర్ల పొడవునా రోడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే, రెసిడెన్షియల్ క్వార్టర్స్ వరకు 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు.