‘50 ఏండ్లు గోస పోసుకుని, రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ ఇవాళ కొత్త రూపంతో మళ్లా వస్తున్నది. మోసపోతే గోస పడతాం. కాంగ్రెస్ హయాంలో మంజీరా నదిని ఎండబెట్టిండ్రు.. దుమ్ము లేపిండ్రు.. మహబూబ్నహర్, ఫత్తేనహర్ కాల్వల్లో చెట్లు మొలిచినయ్. ఇవాళ హెలికాప్టర్లో వస్తూ మంజీరా నదిని చూశా.. నాడు ఎట్లుండే.. ఇవాళ ఎట్లయ్యింది.. నేడు మంజీరా నదిలో నీళ్లు కనపడుతున్నాయి. కాల్వలు ఆధునీకరించుకున్నం. పచ్చని పంట పొలాలు కనపడుతున్నాయి. 40 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. మన నెత్తిమీదనే మల్లన్నసాగర్ ఉంది.. ఇంక ఎక్కడికి సాగునీరు రాలేదో ఆ ప్రాంతానికి సాగునీరు నేనే తీసుకొస్తా. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకండ్ల ముందు ఉంది. పేదల సంక్షేమం, కరెంట్, సాగు నీరు, ఐటీ, సంక్షేమం తదితర అన్ని పనులు, చేసుకున్నం. మనం సంక్షేమంలో నెంబర్వన్లో ఉన్నం. మనకు మరెవరూ సాటిలేరు. ఈసారి కూడా మెదక్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్రెడ్డిని నిండు మనస్సుతో ఆశీర్వదించండి’
మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి మైదానంలో బుధవారం స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. సభా ప్రాంగణం మొత్తం జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. కారు జోరు.. ప్రతిపక్షాలు బేజారు అంటూ నినాదాలు మిన్నంటాయి. యువకుల కేరింతలు, మహిళల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
సిద్దిపేట, నవంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్ హయాంలో మంజీరా నదిని ఎండబెట్టిండ్రు.. దుమ్మ లేపిండ్రు. మహబూబ్నహర్, ఫత్తేనహర్ కాల్వల్లో చెట్లు మొలిచినయి. ఇవాళ హెలికాప్టర్లో వస్తూ మంజీరా నదిని చూశాను..నాడు ఎట్లుండే ఇయ్యాల ఎట్లయ్యింది.. ఇవాళ మంజీరా నదిలో నీళ్లు కనపడుతున్నాయి. కాల్వలను ఆధునీకరించకున్నాం. పచ్చని పంట పొలాలు కనపడుతున్నాయి. 40వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. మన నెత్తిమీదనే మల్లన్నసాగర్ ఉంది.. ఇంక ఎక్కడికి సాగునీరు రాలేదో ఆ ప్రాంతానికి సాగు నీరు తీసుకువస్తా. మెదక్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్రెడ్డిని నిండు మనస్సుతో ఆశీర్వదించండి’.. అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి మైదానంలో స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఈ మధ్యనే మెదక్కు వచ్చినప్పుడు అడిగినవి అన్నీ చేసినట్లు తెలిపారు. ఆ రోజు రామాయంపేట వాళ్లు అడిగినవి అన్నీ ఇచ్చినట్లు చెప్పారు.
పద్మాదేవేందర్రెడ్డి పవర్ ఏందో చూసిండ్రు కదా…రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు వచ్చిందని, మంత్రి హరీశ్రావు వచ్చి ప్రారంభోత్సవం చేసిండని సీఎం చెప్పారు. రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల జీవో వచ్చాయన్నారు. పద్మాదేవేందర్రెడ్డి నాబిడ్డ అని చెప్పి వట్టిగ చెప్పలేదని, పద్మ అనుకుంటే పనులు ఎట్లా అవుతాయే మీరు చూస్తున్నారు కదా అని అన్నారు. ‘మిమ్మల్ని ఒక్కటే మాట కోరుతున్నా.. మీఎమ్మెల్యే పద్మ చొరవ తీసుకుని నన్ను తీసుకువచ్చి హెలికాప్టర్లో దింపింది. మిత్రుడు శేరి సుభాష్రెడ్డి కూడా చెప్పారు. ఇవాళ బ్రహ్మాండంగా పనులు చేసుకున్నాం. ఇంకా ఎక్కడికి సాగునీళ్లు కావాలన్నా మల్లన్నసాగర్ నుంచి తీసుకు వస్తాం. వచ్చిన ప్రాంతాలకు నీళ్లు వచ్చినయి. రాని ప్రాంతాలకు సాగు నీళ్లు తీసుకువస్తా. మెదక్, నర్సాపూర్ ప్రాంతాలకు రావాల్సి ఉంది. కాల్వలు తవ్వుతున్నారు. అవి కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి అవుతాయి’,.. అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 50 ఏండ్లు గోస పోసుకొని రాసి రంపాన పెట్టిన కాంగ్రెస్ కొత్త రూపంతో మళ్ల వస్తున్నదని, మోసపోతే గోస పడతామని సీఎం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో సాగునీరు లేదని..తాగునీరు లేదని, కరెంట్ లేదని, చేనేత కార్మికుల ఆకలి చావులు ఉన్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని తెలిపారు. అన్నీ సరిచేసి ఈ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకండ్ల ముందు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మీరంతా చూడడం జరిగిందని, పేదల సంక్షేమం, కరెంట్, సాగునీరు, ఐటీ, సంక్షేమం తదితర అన్ని పనులు, సంక్షేమం చేసుకున్నట్లు చెప్పారు. మనం సంక్షేమంలో నెంబర్వన్లో ఉన్నామని, మనకు మరెవరు సాటి లేరని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికలు వచ్చాయంటే ఆగం ఆగం కావద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ముందట ఎవరెవరో వస్తారని, అన్ని అబద్ధాలు చెబుతారని, అభండాలు వేస్తారని, ఇష్టం వచ్చిన వాగ్ధానాలు చేస్తారని, అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేస్తారని సీఎం అన్నారు. ప్రజలు బాగా ఆలోచన చేసి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చి పోయే నాయకుల మాటలను నమ్మవద్దన్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్రెడ్డి నిలబడ్డారని, ఇతర పార్టీల వారు నిలబడ్డారని తెలిపారు. నిలబడ్డ అభ్యర్థుల మంచి చెడులు మీరంతా చూడాలన్నారు. వారు ఎలాంటి వారు…వారు గెలిపిస్తే ఏం చేస్తారు.. ఇంతకు ముందు గెలిపిస్తే ఏం చేసిండ్రు..అని చూడాలన్నారు. వారి వెనుక ఉన్న పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు అనే విషయాలను గమనించాలన్నారు. పార్టీల నడవడికను చూడాలన్నారు. ప్రజల చేత ఉండే ఒక్కటే ఒక్క పెద్ద ఆయుధం.. మీదగ్గర ఉండే ఓటు అని… మీఓటు మంచి వాళ్లకు వేస్తే మంచి జరుగతుందని.. ఇక్కడ గెలిచిన వారే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఓటు అనేది మీ తలరాతను రాస్తుందని, జాగ్రత్తగా వేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుందని, లేదంటే ఆ ఓటే మనల్ని కాటేసే ప్రమాదం ఉంటదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకండ్ల ముందే ఉంది అని, కండ్ల ముందే పుట్టిందని.. పెరిగిందన్నారు. ప్రభుత్వంలో పని చేసిందని, వీటన్నింటిని ప్రజలు పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఆలోచించి ఓటు చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞపి చేశారు.
రైతుల గురించి ఆలోచన చేసి అనేక కార్యక్రమాలు చేసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నాడు మెదక్కు వచ్చిననాడు..అప్పటి కలెక్టర్ చెప్పారని, నీటి తీరువా..బకాయిలు ఉన్నాయన్నారు. వీటితో రైతులు బాధ పడుతున్నారని, వాటిని రద్దు చేయాలని అప్పటి కలెక్టర్, మామంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్నారు. వెంటనే రద్దు చేసినట్లు గుర్తుచేశారు. నీళ్లకు ట్యాక్స్ లేదన్నారు. ఘనపురం ఆనకట్ట ద్వారా తీసుకునే నీళ్లకు కూడా ట్యాక్స్ లేదన్నారు. కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లకు కూడా ట్యాక్స్ లేదన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ను ఫ్రీగా ఇస్తున్నామన్నారు. రైతుబంధు ఇస్తున్నామని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ గ్రామాల్లోనే కాంటా పెట్టి కొనుగోలు చేస్తున్నామని, ఇవన్నీ మీకు తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రైతుబంధు ఉండాలంటే పద్మాదేవేందర్రెడ్డి గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు ఉండుడు కాదు పద్మను గెలిపిస్తే రూ. 16 వేలు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు 24గంటల కరెంట్ ఉండాలని సీఎం కేసీఆర్ అన్న మాటలకు.. ఉండాలి అని రైతులు నినదించారు. 3గంటల కరెంట్కు మడి తడుస్తదా..?.10 హెచ్పీ మోటర్లు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెబుతున్నారని, మరి రాష్ట్రంలో 30లక్షల మోటర్లు ఉన్నాయని,ఇవన్నీ మార్చాలంటే వాటికి డబ్బులు ఎవరు ఇయ్యాలి అని ప్రశ్నించారు. ‘ధరణి తీసేస్తరట..ధరణి తీసేస్తే మనకు రైతుబంధు ఎలా వస్తదో అలోచన చేయాలి. రైతుబంధు నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి. మీకు కడుపుల సల్ల కదలకుండా, ఏకాన లంచం లేకుండా మీకు రైతుబంధు వస్త్తుంది. అదే తరహాలో రైతుబీమా కూడా వస్తుంది. ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి వాటి డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నది. ధరణి తీసేస్తే ఇవన్నీ ఎట్లా వస్తయి. మీరు ఆలోచన చేయాలి’.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ ఓటుతోనే మీకన్నును పొడవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదన్నారు. ధరణి తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయని, మళ్ల పాత రోజులు వస్తాయని, దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
* మెదక్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టడంతో సీఎం సీఎం అంటూ సభా ప్రాంగణం అంతా దద్దరిల్లింది.
* సభా ప్రాంగణం వద్ద 4.41 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది
* సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే సభా ప్రాంగణం అంతా జైకేసీఆర్, జైతెలంగాణ నినాదాలతో మార్మోగింది
* సభా ప్రశాంతంగా ముగియడంతో నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
‘పద్మాదేవేందర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలుచున్నోనికి ఏమైనా పోలిక ఉందా..? దిష్టిబొమ్మను నిలబెడితే ఆయన గెలవాలా..మనం ఓడాలనా..ఎవరు గెలవాలి..పద్మనే కదా..100 శాతం ఆమెను గెలిపించండి’..అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మీ తరుపున మీరు కోరిన కోర్కెలను తీర్చే బాధ్యత నాది.. తానే స్వయంగా ఇక్కడికి వచ్చి కూర్చుండి పనులు చేయిస్తా..మీరంతా పెద్ద మనస్సుతో కారు గుర్తుకు ఓటు వేసి పద్మను గెలిపించండి..మీ బాధలు అన్నీ తీర్చే బాధ్యత తనది’..అని సీఎం కేసీఆర్ అన్నారు. మీకోసం పనిచేసే పద్మ గెలిసే మీ రింగ్ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనులు నడుసుకుంటూ వస్తాయన్నారు. రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దని.. ఓటు సులభంగా వేయవద్దని. ..రాజకీయం అంటే గంభీరమైన విషయమని..ఇదేమి సినిమా మ్యాట్నీ షో కాదని..ఎవడో చెప్పిండని ఓటువేస్తే ఆ ఓటే మనల్ని కాటు వేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.