నర్సాపూర్, ఆగస్టు 16: మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి సత్తాచాటాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆయా మండలాల ఇన్చార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 40వేల మంది సభకు తరలించాలన్నారు. సభలో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరతామని తెలిపారు. మరో 2 వేల ఇండ్లు అదనంగా నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరు చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఎన్నడూ చూడని అభివృద్ధి పనులను బీఆర్ఎస్ హయాంలో సీం కేసీఆర్ చొరవతో చేసి చూపించామని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు అవాక్కయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేశారని, రెండు రోజుల్లోనే రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వేసినట్లు పేర్కొన్నారు. గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలను ప్రోత్సహించి సభకు తరలించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతిపక్షాల విమర్శలకు సహించేది లేదని ఇక మీదట ప్రేక్షక పాత్రను పక్కన పెట్టి వారి విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మండలాలకు వచ్చిన ఇన్చార్జిలకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహకరించాలని తెలిపారు. నర్సాపూర్ పట్టణంలో గతంలో సీం కేసీఆర్ సభను విజయవంతం చేసినట్లే కూడా మెదక్ సభను విజయవంతం చేసి శభాష్ అనిపించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అశోక్గౌడ్, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకట్రాంరెడ్డి, ఆయా మండలాల ఇన్చార్జిలు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు శంఖారావం లాంటిది: ఎమ్మెల్సీ యాదవరెడ్డి
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఎన్నికల ముందు వచ్చే శంఖారావం లాంటిదని ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. లక్షా 25 వేల మంది జనాలతో సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారని గుర్తుచేశారు. యావత్ తెలంగాణ ఈ సభ వైపే చూస్తుందని సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారోనని అందరూ ఆత్రుతగా ఉన్నారన్నారు. 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, మళ్లీ బీఆర్ఎస్నే గెలుపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకొని కార్యకర్తల్లో సమన్వయ లోపాన్ని రూపుమాపున్నామన్నారు. ఉద్యమంలో సీఎం కేసీఆర్కు అండగా ఉన్నట్లే ఈ వచ్చే ఎన్నికల్లో కూడా తోడుగా ఉండాలని కోరారు.
సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
ఈ నెల 23న మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మంజీరా, హల్దీ వాగులపై చెక్డ్యామ్లను నిర్మించి రైతులకు సాగునీటి కష్టాలను దూరం చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలను గుర్తుచేస్తూ వారిని ఉత్తేజవంతులను చేయాలన్నారు. అందరం కలిసి కట్టుగా ఉండి సభను విజయవంతం చేయాలని కోరారు.