తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి పాలనలో లో ఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు పవర్ ఫుల్గా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం కొత్త లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి దశాబ్దాలుగా అలుముకున్న చీకట్లను తొలిగించారు. వ్యవసాయానికి 24గంటలూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. కరెంట్ కోతలతో ఒక్క షిఫ్టే గగనంగా నడిచిన పరిశ్రమలు నేడు మూడు షిఫ్టులతో కొనసాగుతున్నాయి. ఇస్త్రీ దుకాణాలు, హెయిర్సెలూన్ షాపులకు సబ్సిడీపై విద్యుత్ను అందిస్తూ కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
సంగారెడ్డి/ మెదక్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు సీఎం కేసీఆర్. దీని ఫలితంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రైతులు, పరిశ్రమల కరెంటు కష్టాలు తీరాయి. జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించారు. ఫలితంగా తొమ్మిదేళ్లుగా ప్రజలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను పొందుతున్నారు. వేసవిలో సైతం నిరంతర విద్యుత్ సరఫరాతో ప్రజలు, రైతులు, పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగం అన్ని కేటగిరిల్లో 8.02 మిలియన్ యూనిట్లు ఉండేది, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనే 14.17 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంది.
ఉమ్మడి పాలనలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కరెంట్ కోతలకు తోడు లోవోల్టేజీ సమస్య వేధించేది. బోరుబావులు ఉన్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ వ్యవసాయనికి 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటించారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా కావడంతో రెండు జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014లో అతి తక్కువ వ్యవసాయ విద్యుత్ సర్వీస్లు ఉండగా, ఇప్పుడు లక్షల్లో వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2014కు ముందు సంగారెడ్డి జిలాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ప్రస్తుతం 7.50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. 2014లో వరి సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 2104లో సంగారెడ్డి జిల్లాలో 68 వేల బోరుబావులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,00,788కి పెరిగింది. ఈ కనెక్షన్లకు ప్రభుత్వం రూ.1438 కోట్ల విలువైన విద్యుత్ను సబ్సిడీ రూపంలో అందజేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు. వేసవి కాలం వచ్చిందంటే గంటల తరబడి కోతలుండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కరెంట్ కోతలకు సెలవులిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 2014లో 4,30,581 మంది విద్యుత్ వినియోగదారులు ఉంటే ప్రస్తుతం 7,45,230 కు విద్యుత్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. మెదక్ జిల్లాలో 2014లో 3.16 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా ప్రస్తుతం 5.54 లక్షల మంది ఉన్నారు. వీరితోపాటు 68,461 మంది కమర్షియల్ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్నది. జిల్లాల్లోని మారుమూల తండాలకు సైతం విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఎస్టీలు ఉచితంగా, లాండ్రీ, హేయిర్ సెలూన్లకు సబ్సిడీపై ప్రభుత్వం విద్యుత్ అందిస్తున్నది.
ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలకు విద్యుత్ లేక లే ఆఫ్ ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిశ్రమలకు 24 గంటల హైటెన్షన్ విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఫలితంగా పరిశ్రమలు తొమ్మిదేళ్లలో ఒక్క లేఆఫ్ లేకుండా పని చేస్తున్నాయి. దీంతో కార్మికులు ఓవర్ షిఫ్టులు కూడా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణకు ముందు 4351 పరిశ్రమలు ఉండేవి. ప్రస్తుతం 7297 పరిశ్రమలున్నాయి. జిల్లాలోని ఔషధ, బల్క్డ్రగ్, ఇతర కంపెనీలు మూడు షిఫ్టులు పని చేస్తున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల నుంచి కార్మికులు వచ్చి జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల నుంచి ఏటా రూ.3 వేల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయంటే అందుకు నిరంతర విద్యుత్ సరఫరాయే కారణంగా చెప్పవచ్చు.
మెదక్ జిల్లాలో 2018 జనవరి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఉచిత విద్యుత్ అమలు చేసి, సాంకేతిక సమస్యలను పరిశీలించారు. జిల్లాలో విజయవంతంగా కావడంతోనే రాష్ట్రమంతటా అమలు చేసింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 1,02,316 ఉన్నాయి. 2018 కంటే ముందు 89,479 ఉన్నాయి. 2018 కంటే ముందు 19,761 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, 2022 డిసెంబర్ నాటికి 24,010 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించింది. కొత్తగా విద్యుత్లైన్లు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యలు లేకుండా వేలాది ట్రాన్స్ఫార్మర్లు, పదుల సంఖ్యలో 33/11 కేవీ, 132/11 కేవీ సబ్స్టేషన్లు, వేలాది విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా 220/132 కేవీ సబ్స్టేషన్, మూడు 132/33 కేవీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 45 నిర్మించింది. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఇటీవలే జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కొత్త సబ్స్టేషన్లను ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా 111 అదనపు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరాను పెంచే ట్రాన్స్ఫార్మర్లు 21 ఏర్పాటు చేశారు. పట్టణాలు, పల్లెల్లో 17,343 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ విద్యుత్ లైన్లు 383 కిలోమీటర్లు, 11 కేవీ విద్యుత్ లైన్లు 3441 కిలోమీటర్లు, ఎల్టీ లైన్ 3549 కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ‘పవర్ డే’ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలను దాదాపు తొలిగించింది.
తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించి, వారిని ఆదుకున్నారు. కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తానని
సీఎం కేసీఆర్ ప్రకటించడంతో
హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఉప్పల ప్రకాశ్, నాయీ బ్రాహ్మణుడు, శివంపేట్ (నర్సాపూర్)
జహీరాబాద్ డిస్కం పరిధిలో కరెంట్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేసింది. గతంలో కరెంట్ సరఫరా చేయాలని రైతులు సబ్స్టేషన్లు ఎదుట ధర్నాలు చేసే వారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలంలో కొత్తగా 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లు నిర్మాణం చేసి వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
జహీరాబాద్ డిస్కం పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కొత్తగా లైన్లు నిర్మాణం చేశాం. తెలంగాణలో విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.317.16 కోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం. కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు నిర్మాణం చేశాం. ఎక్కడ సమస్యలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నాం.
– లక్ష్మీనారాయణ, డీఈఈ డిస్కం జహీరాబాద్