60 ఏండ్లలో చేయని అభివృద్ధిని గజ్వేల్లో సీఎం కేసీఆర్ కేవలం ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాడు రైతు ఆత్మహత్యలు, కరువు కాటకాలతో ఈ ప్రాంతం గోసపడిందన్నారు. ఇవాళ వాహ్ గజ్వేల్…శభాష్ గజ్వేల్ అనేలా ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. మండుటెండల్లో హల్దీ, కూడవెల్లి వాగులు మత్తడి దుంకుతున్నాయని, ఇదంతా కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు కట్టించి తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసినట్లు తెలిపారు. గజ్వేల్కు రైలు తీసుకొచ్చి ప్రజల కలను నెరనేర్చినట్లు తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి అభివృద్ధిని విస్మరించారన్నారు.
– గజ్వేల్, ఏప్రిల్ 21
గజ్వేల్, ఏప్రిల్ 21: “అడగకుండానే గజ్వేల్ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు సీఎం కేసీఆర్, నేడు గజ్వేల్ అభివృద్ధి గజమాలలాంటిదని, కేసీఆర్ గజ్వేల్ నుంచే ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సుకృతమని చెప్పుకోకతప్పదు” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకనాటి గజ్వేల్కు ఈనాటి గజ్వేల్ను చూస్తే గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను ఉన్న సమయంలో ఇక్కడ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటే పక్క రాష్ర్టాల నుంచి విలేకరులు వచ్చి వారి స్థితిగతులు రాసేదన్నారు. చనిపోతే కనీసం ఎక్స్గ్రేషియో ఇవ్వలేని ప్రభుత్వాలు ఉండేవి,ఆకలి చావులు, అంబలి కేంద్రాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామన్నారు. ఆనాడు ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకుంటే వార్తలు రాసేందుకు విదేశాలు, పక్క రాష్ర్టాల నుంచి వచ్చిన విలేకరులను చూశామన్నారు. ఇవాళ పక్క రాష్ర్టాల నుంచి వచ్చేవారంతా వాహ్ గజ్వేల్…శభాష్ గజ్వేల్ అంటున్నారన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి ఐఏఎస్, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు గజ్వేల్ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. గజ్వేల్ మార్కెట్ను చూసి సెల్ఫీలు తీసుకున్నారన్నారు. కోమటిబండ మహాఅద్భుతం అయింది, ఇతర రాష్ర్టాల నాయకులు చూసిపోతున్నారని గుర్తుచేశారు. నిజంగా 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దుబాయ్ పోయిన వాళ్లు మూడేండ్ల తర్వాత వచ్చి గజ్వేల్ను చూసి మురిసిపోతున్నారన్నారు. కొద్ది రోజుల్లోనే గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎనకటి రోజుల్లో బతుకమ్మ, వినాయక చవితి పండుగలోస్తే నిమజ్జనం చేయాలంటే చుక్క నీరులేక ఎండిపోయిన చెరువులు కనిపించేవి, కానీ కాళేశ్వరం పాజెక్టు నిర్మాణంతో మండుటెండల్లో హల్దీ, కూడవెల్లి వాగులు మత్తడిదుంకుతూ కనిపిస్తున్నాయన్నారు. నాచారం హల్దీ వాగుపై చెక్డ్యామ్ మత్తడి దుంకుతుంటే హైదరాబాద్ వాళ్లు వాహ్ అంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారన్నారు. హల్దీవాగు 96కిలోమీటర్లు ప్రవహించి నిజాంసాగర్లో కలిసింది. ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను ఎవరూ మర్చిపోరని పేర్కొన్నారు.
ఎరువుల తిప్పలు తప్పాయి…
గజ్వేల్ ప్రజల కోసం సీఎం కేసీఆర్ అడగకుండానే హార్టికల్చర్, అటవీ యూనివర్సిటీలు, గజ్వేల్ చుట్టూ ఓఆర్ఆర్, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం, రాష్ట్రంలోనే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు కట్టించి గజ్వేల్కు రైలు తీసుకొచ్చి ప్రజల కలను నెరవేర్చిన నాయకుడు మన సీఎం కేసీఆర్ అన్నారు. రైలు రాకతో గజ్వేల్కు ఎరువుల తిప్పలు తప్పాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కేసీఆర్ సీఎం కాకముందు గజ్వేల్ మండలంలో రైతులు 2300 ఎకరాల్లో వరిసాగు చేస్తే ఇప్పుడు 15000 ఎకరాల్లో సాగుచేశారన్నారు.
ఆనాడు గతుకుల గజ్వేల్ నేడు బతుకునిచ్చే గజ్వేల్గా మారిందని, ఇదంతా గజ్వేల్కు కేసీఆర్ రావడంతోనే జరిగిందన్నారు. ఎక్కడ చూసినా మోచేతి లోతు గుంతలు పూడ్చేందుకు పైసలివ్వని ప్రభుత్వాలను చూశాం, గుంతలో మట్టి పోయలేని పరిస్థితి ఉండేది కానీ సీఎం కేసీఆర్ రాకతో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందన్నారు. అడగకుండానే సీఎం కేసీఆర్ గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిన గొప్ప నాయకుడన్నారు. రెండుసార్లు గెలిపించడంతోనే మీపై ప్రేమతో ఎన్నో పథకాలు అమలు చేశాడన్నారు. ప్రజల మీద ఉన్న మమకారంతో కలను సాకారం చేశాడని, అభివృద్ధిలో 60 ఏండ్లు వెనక్కి ఉన్న గజ్వేల్ను 60 ఏండ్లు ముందుకు తీసుకెళ్లిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే జరిగిందన్నారు.
గజ్వేల్ అభివృద్ధిని చూసి ఇతర జిల్లాల నాయకులు తమ వద్దనే కేసీఆర్ పోటీ చేసేలా చూడాలని తనను అడుగుతున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీచేసినా కండ్లకు అద్దుకొని గెలిపించుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్ ఎంపీగా మూడుసార్లు, మహబూబ్నగర్లో ఎంపీగా గెలిపించారని ఇక గజ్వేల్ ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో రెండుసార్లు పార్టీని నిలబెట్టిన వారు ఒకరు కేసీఆర్, మరొకరు ఎన్టీఆర్ అన్నారు. ఇద్దరి మధ్యలో 50కి పైగా కొత్తపార్టీలొచ్చాయి పోయాయి కానీ వారికి మాత్రం ప్రజల్లో ఆదరణ తగ్గలేదన్నారు. తెలంగాణ రాష్టాన్ని సీఎం కేసీఆర్ ఎలా సాధించారో అలాగే ఉద్యమ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాదనుకున్న మల్లన్నసాగర్, రానే రాదనుకున్న తెలంగాణను సాధించి చూపించారన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఒకసారి సీఎం కేసీఆర్తో పెట్టించాలని పలువురు కార్యకర్తలు, నాయకులు మంత్రిని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, మడుపు భూంరెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు పండరి రవీందర్రావు, రమేశ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు భోజనం వడ్డించిన మంత్రి హరీశ్రావు
బీఆర్ఎస్ గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కార్యకర్తలకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు స్వయంగా భోజనం వడ్డించడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. సమయపాలన పాటిస్తూ కార్యకర్తలు భోజనం చేశారు.
బీజేపీ టార్గెట్గా పనిచేయాలి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్గా కార్యకర్తలు పని చేయాలి. బీజేపీ నాయకులు చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసే విధంగా చూడాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో నేడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చే ప్రతి విషయంపై దృష్టి సారించాలి. అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజల్లో ఆదరణ కోసం బీజేపీ నాయకులు తాపత్రయం పడుతున్నారు.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య మౌలిక వసతుల సంస్థ చైర్మన్
మనం నీళ్లు తెస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి
మనం తెలంగాణ ప్రజల కోసం నీళ్లు తెస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు కన్నీళ్లువస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగని తెలంగాణలో నేడు పరుగులు పెడుతున్నది. రైతులకు సాగునీరు ఇచ్చి సీఎం కేసీఆర్ వారి ముఖాల్లో నేడు చిరునవ్వు చూశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర రాష్ర్టాల రైతులు, నాయకులు బీఆర్ఎస్ వెంటే నడిచేందుకు ముందుకొస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో నాటకాలు ఆడిన బండి పేపర్ లీక్తో అడ్డంగా దొరికాడు. పేపర్ లీక్ను ప్రోత్సహించిన బీజేపీ నాయకులకు భవిష్యత్లో తగిన గుణపాఠం చెప్పాలి. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించాలి. సీఎం కేసీఆర్ పీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యకర్తలు కష్టపడి పని చేయాలి. ప్రతి సంక్షేమ పథకం ఆణిముత్యంలాంటిది.
– బి.వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ
ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి
వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి. సీఎం కేసీఆర్ను మరో సారి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఎన్ని శక్తులు ఎదురైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు వచ్చి చూసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయి. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ బలోపేతానికి కృషిచేయాలి. రాష్ట్రంలో బీజేపీ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి. గత తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పేదలకు న్యాయం జరిగింది. గుర్తుపట్టని విధంగా గజ్వేల్ రూపురేఖలు మార్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉంటారు.
– వంటేరి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ను చూస్తే మోదీ జంకుతున్నడు
సీఎం కేసీఆర్ పరిపాలన చూస్తే బీజేపీకి భయం పట్టుకుంది. సీఎం కేసీఆర్ను చూస్తే మోదీ జంకుతున్నడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ సీటును ఎక్కడ కదిలిస్తాడోననే భయం బీజేపీ నాయకుల్లో ఉంది. కేంద్రం సహకరించకపోయినా అన్ని విధాలుగా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారు. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని పరిస్థితి ఉండేది. నేడు గ్రామాల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొంటున్నది. ప్రతి పల్లెలో సీఎం కేసీఆర్ రాజ్యం, ప్రతి ఇంట్లో ముఖ్యమంత్రి కనిపిస్తున్నాడు. తెలంగాణలో మట్టి బంగారం అయ్యింది. ఎక్కడ చూసినా ఎకరం కోటికి చేరింది. తెలంగాణను అభివృద్ధి చేయడంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నది. తెలంగాణను దెబ్బతీసేందుకు మోదీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్ అభివృద్ధిని ఎక్కడా విస్మరించలేదు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకండా మోదీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మెడికల్ కళాశాలలు, బస్తీ దవాఖానల ఏర్పాటుతో ఆరోగ్య తెలంగాణగా మారింది.
– వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
భారీ మెజార్టీతో కేసీఆర్ను గెలిపించుకోవాలి
గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. సీఎం కేసీఆర్కు మంచి మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలి. అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. గజ్వేల్ అభివృద్ధిని చూసిన ఇతర రాష్ర్టాల వారు ఫిదా అయ్యారు. గజ్వేల్ ప్రజలకు మంచి చేసిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ముమ్మరంగా ప్రచారం చేయాలి. పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తెలిసేలా చూడాలి. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. పార్టీకి కార్యకర్తలే బలం.
– మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్