సిద్దిపేట, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి నలుదిక్కుల నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట పట్టణాన్ని సమగ్రంగా అన్ని వైపులా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుంచి లింగరెడ్డిపల్లి మీదుగా మెట్టుబండలు, చిన్నకోడూరు మండల కేంద్రం మీదుగా ఇల్లంతకుంట వరకు నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కల్వర్టుల నిర్మాణాలతో పాటు విద్యుత్ స్తంభాల బిగింపు పనులు జోరందుకున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా కంకర పరిచి రోలర్తో తొక్కించే పనులు జట్ స్పీడుగా జరుగుతున్నాయి. ఒక వైపు సిద్దిపేట- హనుమకొండ, ఇంకోవైపు మెదక్- సిద్దిపేట రహదారి విస్తరణ పనులు నడుస్తున్నాయి. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా అన్ని వైపులా రహదారులను విస్తరిస్తూ బట్టర్ ఫ్లై లైట్లు, ఫుట్పాత్లు ఉండే విధంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట రహదారికి రూ. 254 కోట్లు
జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఎల్లమ్మగుడి నుంచి ప్రారంభమై చిన్నకోడూరు మండలం మీదుగా ఇల్లంతకుంట వరకు రహదారిని నాలుగులేన్ల రహదారిగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు 32 కి.మీటర్లు సిద్దిపేట జిల్లా పరిధిలో 22 కి.మీటర్లు ఉంటుంది. ఈరహదారి విస్తరణకు సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంలో మంత్రి హరీశ్రావు చేసిన విజ్ఞప్తి మేరకు రూ. 254 కోట్లు మంజూరు చేశారు. ఈ రహదారి రెండు జిల్లాలను కలుపుతున్నది. సిద్దిపేట జిల్లా పరిధిలో 22 కి.మీటర్ల వరకు రోడ్డు విస్తరణకు రూ. 174 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 0 నుంచి 10 కి.మీటర్ల వరకు తొలి రీచ్, 10 నుంచి 22 కి.మీటర్ల వరకు రెండో రీచ్గా విభజించారు. ఇక మూడో రీచ్ పనులకు రూ. 82 కోట్లు. మూడో రీచ్ పనులు 22 నుంచి 32 కి.మీటర్ల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వస్తుంది.
32 కిలో మీటర్ల రహదారి విస్తరణ
సిద్దిపేట జిల్లా కేంద్రం ఎల్లమ్మ గుడి, లింగారెడ్డిపల్లి మీదుగా మెట్టుబండలు, మండల కేంద్రమైన చిన్నకోడూరు నుంచి సలెంద్రి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లీపూర్, కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు 32 కి.మీ ఈ రహదారి విస్తరణను చేపడుతున్నారు. ఈ రహదారిని వెడల్పు చేయడం వల్ల సిద్దిపేట పట్టణం నుంచి ఈ మార్గంలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడి, సిద్దిపేట పట్టణంలోని వైద్యకళాశాలకు, విద్యా సంస్థలకు, వ్యవసాయ మార్కెట్ లాంటి నిత్యం పనులు ఉండే ప్రదేశాలకు రాకపోకలు సాగించడం చాలా సులువు అవడమే కాకుండా, సమయం కూడా తగ్గుతుంది. చిన్నకోడూరు మండలంలో ఎక్కువగా కూరగాయల సాగు చేస్తారు. రైతులకు ఈ రహదారి నిర్మాణంతో ఎంతో మేలు కలుగుతుంది.హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి ప్రాంతంలో కూరగాయలు కొనుగోలు చేస్తారు. దీంతో ఇటు రైతులకు అటు విద్యార్థులకు కూడా రోడ్డు మీద ప్రయాణ సమయం తగ్గుతుంది.
పలు రహదారులకు అనుసంధానం
సిద్దిపేట పట్టణ కేంద్రంతో పాటు చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ.. సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్, నంగునూరు మండలంలోని తిమ్మాయిపల్లి రింగు రోడ్డుకు అనుసంధానం అవుతుంది. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ జంక్షన్ వద్ద బెజ్జంకి మండల కేంద్రం అనుసంధానంతో పాటు ఇల్లంతకుంట వరకు జరిగే ఈ మార్గం ఇల్లంతకుంట నుంచి కరీంనగర్, సిరిసిల్లకు కూడా అనుసంధానం అవుతుంది. రెండు నియోజకవర్గ ప్రజల ప్రయాణానికి మేలు జరుగనున్నది. ఒక వరుస రహదారి నుంచి నాలుగు వరుసల రహదారి నిర్మాణం కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలోనే రంగనాయక, అన్నపూర్ణ రిజర్వాయర్లు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతకంగా నిర్మించిన రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు ఈ మార్గంలోనే వస్తాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణళికలు సిద్ధం చేసింది. ఇక సిద్దిపేట పట్టణానికి ఆనుకొని ఉన్న రంగనాయకసాగర్ ప్రాజెక్టు అద్భుత పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నది. మూడు టీఎంసీల సామర్థ్యంలో ఈ రిజర్వాయర్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు మధ్యలో రూ.8 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం గెస్ట్హౌస్ నిర్మించారు. వంద కోట్లతో పర్యాటక కేంద్రంగా తిర్చిదిద్దుతున్నారు. రంగనాయక్ సాగర్ ప్రాంతం రానున్న రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందనున్నదని సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్న వేళ ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటిగా నిధులు మంజూరు కావడం ఈప్రాంత ప్రజల అదృష్టం అని చెప్పాలి. రిజర్వాయర్లను చూడటానికి వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. దీంతో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా రిజర్వాయర్లు మారుతున్నాయి. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించడంతో ఇక ఈ మార్గం రాచబాటనే అని చెప్పాలి.
రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి
సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.ఈ రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తాను చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే రూ. 254 కోట్లు మంజూరు చేశారు. ఈ రహదారి రెండు జిల్లాలను కలుపుతుంది.సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు 32 కి.మీటర్లు ఉంటుంది. రహదారుల విస్తరణ వల్ల ఇటు ప్రజలకు అటు రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. రంగనాయకసాగర్కు వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో రంగనాయకసాగర్ ఒక బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రం కాబోతున్నది. ఇక్కడి వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇల్లంతకుంట -సిద్దిపేట రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
– తన్నీరు హరీశ్రావు,ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి
సిద్దిపేట – ఇల్లంతకుంట రహదారి విస్తరణ వివరాలు
సిద్దిపేట -ఇల్లంతకు రహదారి పొడవు : 32 కి.మీటర్లు
మంజూరైన రూపాయలు : రూ.254 కోట్లు
సిద్దిపేట జిల్లా పరిధి పొడవు : 22 కి.మీటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధి పొడవు : 10 కి.మీటర్లు
ఎన్ని వరుసలుగా విభజిస్తారు : నాలుగు వరుసలుగా
మధ్యన డివైడర్లు, అవసరమైన చోట లైటింగ్ సిస్టమ్
రహదారి విస్తరణకు ఎన్ని రీచ్లుగా విభజన : 3 రీచ్లుగా
0 నుంచి 10 కి.మీటర్ల వరకు : మొదటి రీచ్ (సిద్దిపేట జిల్లా)
10 నుంచి 22 కి.మీటర్ల వరకు : రెండో రీచ్ (సిద్దిపేట జిల్లా)
22 నుంచి 32 కి.మీటర్ల వరకు : మూడో రీచ్ (రాజన్నసిరిసిల్ల జిల్లా)