Medak | మెదక్, (నమస్తే తెలంగాణ) మెతుకు సీమ మెదక్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. మరోసారి మెదక్ ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఒకప్పుడు మెతుకు సీమగా పేరొందిన మెదక్ సమైక్య పాలనలో అభివృద్ధి కుంటుపడింది. 2014కు ముందు ఎక్కడా రహదారులు లేవు. చాలా గ్రామాల్లో తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయానికి రోజుకు నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా అయ్యేది కాదు. గత తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో ఏ మండలం, ఏ గ్రామంలో చూసినా కళ్లెదుట అభివృద్ధే కనిపిస్తున్నది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి పరుగులు పెడుతున్నది.
115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘనపూర్ ప్రాజెక్టును 2014 డిసెంబర్ 17న సీఎం కేసీఆర్ సందర్శించి రూ.50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.43.64 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుకు వనదుర్గగా కేసీఆర్ నామకరణం చేశారు. అనంతరం ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల 30 వేల ఎకరాలకు సాగునీరు అందడం ద్వారా భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి.
కోట్లాది రూపాయల కేటాయింపు…నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం వివిధ శాఖలకు కోట్లాది రూపాయలు కేటాయించింది. ఇరిగేషన్కు రూ.400 కోట్లు, పంచాయతీరాజ్కు రూ.462 కోట్లు, ఆర్అండ్బీకి రూ.305 కోట్లు, విద్యుత్కు 60 కోట్లు, చేప పిల్లల పంపిణీ కోసం రూ.8.50 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.543 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.100 కోట్లు కేటాయించింది. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.106 కోట్లు మంజూరు చేసింది. మిషన్ భగీరథ పథకం కింద రూ.454 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి రూ.10 కోట్లు, మిషన్ కాకతీయ కోసం రూ.340 కోట్లు కేటాయించింది.
మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రైల్వేలైన్ ఏర్పాటును సీఎం కేసీఆర్ నెరవేర్చారు. రూ.205 కోట్లతో అక్కన్నపేట-మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల పొడువునా రైల్వేలైన్ నిర్మించారు. అక్కన్నపేట స్టేషన్ నుంచి ఈ రైలుమార్గం ప్రారంభమవుతున్నది. లక్ష్మాపూర్, శమ్నాపూర్, మెదక్లో రైల్వేస్టేషను ్లఏర్పాటు చేశారు.