అందోల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే కాంత్రికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అందోల్ మండలంలోని డాకూర్ గ్రామ శివారులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. దళితులు అధిక సంఖ్యలో ఉన్న అందోలు నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ఒకే విడతలో గ్రౌండింగ్ చేస్తామని సీఎం ప్రకటించారు. నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని దళితబంధు పథకాన్ని ఒకే విడతలో అంతటా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో నియోజకవర్గంలో 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతో అందోల్ భవిష్యత్తు, ప్రజల తలరాతలు మారుతాయని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. అందోల్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు.
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ అందోల్, నవంబర్ 27: దళితులు అధిక సంఖ్యలో ఉన్న అందోలు నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ఒకే విడుతలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని దళితబంధు పథకాన్ని ఒకే విడతలో నియోజకవర్గమంతటా అమలు చేస్తామని తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ అధ్యక్షతన అందోల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అందోల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని, అందోల్లో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలోని దళితులు ఏండ్లు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దళితులపై ప్రేమఉంటే కాంగ్రెస్ దళితబంధు లాంటి పథకం ఎందుకు తీసుకురాలేదని, కాంగ్రెస్ అలాంటి పథకాలు తీసుకువస్తే దళితులు పేదలుగా మిగిలేవారు కాదన్నారు. గిరిజనుల కోరిక మేరకు వారి ఆరాధ్యదైవం సేవాలాల్ జయంతి రోజున సెలవును ప్రకటిస్తామని తెలిపారు.
అందోల్ నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ కోరిన కోర్కెలు అన్ని నెరవేరుస్తామని తెలిపారు. అందోల్తో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. అందోల్కు చెందిన దివంగత నేత మాణిక్రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో జోగిపేట పట్టణంలోని గల్లీగల్లీ తిరిగానని తెలిపారు. అందోల్ అభివృద్ధి కృషి చేయటంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించానని, రోడ్లు వేయించానని చెప్పారు. సీఎం హోదాలో అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో అందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో అందోల్ నియోజకవర్గంలో 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న క్రాంతికిరణ్ స్థానికుడని, సౌమ్యుడని ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 24గంటల కరెంటు, రైతుబంధు పథకాలు కొనసాగాలంటే చంటి క్రాంతికిరణ్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజాఆశీర్వాద సభకు పెద్దఎత్తున జనం రావాటాన్ని చూస్తే అందోల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. కాంగ్రెస్ వాళ్ల సభకు జనాన్ని తీసుకువస్తే బీఆర్ఎస్ బహిరంగసభకు జనమే స్వచ్ఛందంగా కదిలివచ్చారని తెలిపారు.
అందోల్ నియోజకవర్గ రైతులకు సింగూరు జలాలను అందజేసిన ఘనత తమదేనని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు చెప్పారు. అందోల్ నియోజకవర్గం నెత్తిపైన కుండలా ఉండే సింగూరు ప్రాజెక్టు నుంచి దామోదర ఎందుకు సాగునీరు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రా నేతలు, సమైక్యవాదులు ఈ ప్రాంత రైతుల నోరుకొట్టి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సింగూరు జలాలను తీసుకుపోతే అప్పుడు దామోదర రాజనర్సింహ నోరు మెదపలేదన్నారు. సింగూరు ఆయకట్టు, ఘనపురం ఆయకట్టు, నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగూరు జలాలను హైదరాబాద్కు తాగునీటి అవసరాలకు తరలించాయని తెలిపారు. అందోల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు తాము పోరాటం చేశామన్నారు. తమ కృషి వల్లే అందోల్లో 40వేల ఎకరాలకు సింగూరు ద్వారా సాగునీరు అందుతున్నట్లు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్కపైసా నిధులు ఇవ్వమని అసెంబ్లీలో అంటే దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వాడని తెలిపారు. తెలంగాణ కోసం దామోదర తన పదవికి రాజీనామా చేయలేదన్నారు. డిప్యూటీ సీఎం పదవికంటే పెద్ద పదవి ఏముంటుందని, అంత పెద్ద పదవిలో ఉండి దామోదర అందోల్ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడుగంటల విద్యుత్ ఇస్తామని చెప్పినా దామోదర పెదవి విప్పటం లేదన్నారు. అందోల్ రైతుల గురించి పట్టని దామోదరకు ఎలా ఓటు వేస్తారని ప్రజలను ప్రశ్నించారు. స్థానికుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే క్రాంతికిరణ్ను అందోలు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
అందోల్ అంటే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే అందోల్ నియోజకవర్గం మొత్తం ఇక్కడే ఉన్నట్లు కనిపిస్తున్నదని మన అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపు డిసైడ్ అయ్యిందన్నారు. కాంగ్రెసోళ్లకు సొయిలేదు.. ఇకపై కూడా రాదని వాళ్ల మాయమాటలు నమ్మొదన్నారు. క్రాంతిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.. అందోల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటానన్నారు. రైతుబంధుకు ప్రాణంపోసింది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమని దానిపై సైతం కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసి డబ్బులు వేయకుండా నిలిపివేశారన్నారు. రైతుబంధు ఆపితే మన గెలుపు ఆగుతదా..? 3న మళ్లీ గెలుస్తాం..? 6న రైతుబంధు డబ్బులు జమచేస్తాం… కేసీఆర్ బతికుండగా రైతుబంధు ఆగదు అని అనడంతో సభ ఒక్కసారిగా సీఎం కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో మార్మోగింది. ప్రజలు ఆగం కావొద్దు ఆలోచించే ఓటేయాలన్నారు.
రాయికోడ్/వట్పల్లి/మునిపల్లి, నవంబర్ 27: అందోల్ మరింత అభివృద్ధి చెందాలంటే ముచ్చటగా మూడోసారి అందోల్ నియోజకవర్గంలో గులాబీజెండా ఎగరాలని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని డాకూర్ శివారులో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వద సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రసంగించారు. నియోజకవర్గానికి చెందిన పలు అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు విన్నపాలు సీఎం కేసీఆర్ ముందు ఉంచామన్నారు. గత పాలకుల తీరుతో అందోల్ నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గతంలో అందోల్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగాగ పనిచేసి, ఉమ్మడి రాష్ర్టానికి ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహించి నియోజకవర్గానికి ఒరగబెట్టింది లేదన్నారు.
నియోజకవర్గానికి అడిగిన వెంటనే అభివృద్ధి కోసం కోట్ల రూపాయాలు విడుదల చేసినందుకు అందోల్ ప్రజలు సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని దళితులందరికీ ఒకేసారి దళితబంధు పథకాన్ని అందించాలని, పీజీ కాలేజీ మంజురు చేయాలని, సింగూర్ను పర్యాటక కేంద్రంగా మార్చి నిధులు మంజూరు చేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు అనుగునంగా స్పందించిన సీఎం కేసీఆర్ అందోల్పై వరాలజల్లు కురిపించారు. అందోల్ అభ్యర్థి క్రాంతి కిరణ్ అడిగినవన్నీ నేరవేర్చాలి అంటే అందోల్లో గులాబీ జెండా ఎగురాలని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్, కార్పొరేషన్ చైర్మన్ భిక్షపాతి, ఎమ్మెల్సీ రాఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్మపర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రాహుల్ కిరణ్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అందోల్/రాయికోడ్/ మునిపల్లి/ వట్పల్లి, నవంబర్ 27: జోగిపేట పట్టణంలో సీఎం ప్రజాఆశీర్వాద సభ ప్రాంగణం జనంతో హోరెత్తింది. ప్రజా ఆశీర్వాద సమావేశ ప్రాంగణమంతా కనుచూపు మేర ఎటుచూసినా గులాబీవనంగా మారింది. వట్పల్లి-జోగిపేటకు వెళ్లే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సోమవారం నియోజకవర్గంలో జోగిపేట, డాకూర్ మధ్యలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్సక్సెస్ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగిపేటకు వచ్చిన సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. కళాకారులు ఆటపాటలతో ఉత్తేజాన్ని నింపారు. కళాకారులు పాడుతున్న పాటలతో ప్రజలు చిందులేస్తూ సందడి చేశారు.
సభకు హెలిక్యాప్టర్లో హాజరైన సీఎం పైనుంచే ప్రజా ఆశీర్వాద సభను వచ్చిన జనాన్ని తిలకించారు. సభకు హాజరైన జనం హెలిక్యాప్టర్లో వస్తున్న సీఎం కేసీఆర్ను సెల్ఫోన్లలో ఫొటోలు తీశారు. ప్రజాఆశీర్వాద సభకు ఉహించని రీతిలో తరలివచ్చిన జనంతో సభాప్రాంగణం కిటకిటలాడింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపాతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మున్సిపాల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, జోగిపేట మార్కెట్ చైర్మన్ పల్లె సంజీవయ్య, అందోల్ ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగభుషణం, నారాయణ, మల్లికార్జున్తో పాటు వివిధ మండలాల ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.