సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 22: మార్చి 18 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలకు మీ బిడ్డను శ్రద్ధగా చదివించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గ పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో గురువారం హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 18 నుంచి పరీక్షలు ఉన్నందున మీ పిల్లలను మంచిగా చదివించాలని..ఫంక్షన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని ఉత్తరం రాసినట్లు గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడంతోపాటు సొంత ఖర్చులతో స్నాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీ పిల్లలను నా బిడ్డలుగా భావిస్తానని, వారు మంచి మార్కులు సాధించాలన్నదే తన తాపత్రేయమన్నారు. కొంతమంది పిల్లలు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం లేదని.. పరీక్షలయ్యే వరకు ప్రతిరోజూ పాఠశాలకు పంపించాలన్నారు. కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. పదోతరగతి భవిష్యత్కు పునాది అని.. ఇందులో ఒక మెట్టు ఎక్కితే భవిష్యత్లో పైచదువులకు, ఉద్యోగానికి అవకాశం ఉంటుందన్నారు. ఇంటి వద్ద చదివించే బాధ్యత మీది.. అందుకు నా పూర్తి సహకారం ఉంటుందన్నారు.
మీ పిల్లలను చదివిస్తున్నారా…టీవీలు బంద్ చేస్తున్నారా.. అని మాజీమంత్రి హరీశ్రావు విద్యార్థుల తల్లిదండ్రులను అడగ్గా.. కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ..మీరు పంపిన ఉత్తరం వచ్చింది..మా బిడ్డకు చదివి లెటర్ రాయమని చెప్పామని సమాధానం ఇచ్చారు. చిన్నకోడూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన స్వామి మాట్లాడుతూ..సార్ మా బిడ్డల గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్న మీ రుణం తీర్చుకోలేనిది. అందుకే మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లో ఉంటారు సార్ అని ఉద్వేగంగా చెప్పారు. దీనికి మాజీమంత్రి హరీశ్రావు బదులిస్తూ సిద్దిపేట నా కుటుంబం, నా బిడ్డలుగా భావిస్తా. ఇది నా బాధ్యత అన్నారు.