సర్వమత సమ్మేళనానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తున్నది. అన్ని పండుగలు సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది ఆయా వర్గాల్లోని పేదలకు పండుగ కానుకలు అందజేస్తున్నారు. ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పేద క్రైస్తవులకు పంపిణీ చేయనున్న గిఫ్ట్ ప్యాక్లు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున రెండు జిల్లాల్లో ఆరువేల మందికి కానుకలు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగకు ముందు ప్రభుత్వం తరఫున ఇచ్చే విందు కోసం రూ.12 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గిప్ట్ప్యాక్లలో మగవారికి ప్యాంటు, షర్టు, మహిళలకు చీర, జాకెట్ ఉంటాయి. పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో అర్హులందరికీ కానుకలు అందేలా మైనార్టీ శాఖ చర్యలు తీసుకుంటున్నది.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, డిసెంబర్ 12
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, డిసెంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తూ వేడుకలను జరుపుతున్నది. ఇందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పండుగ కానుకలను అందజేస్తున్నది. ఈ మేరకు నియోజకవర్గానికి వెయ్యి చొప్పున బహుమతులు అందజేయనుండగా, కానుకలు ఇప్పటికే మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చేరుకున్నాయి. అదేవిధంగా క్రిస్టియన్లకు విందు భోజనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నది. జిల్లాకు చేరిన కానుకలను అధికారులు ఆయా నియోజకవర్గాలకు తరలించగా, మరో వారం రోజుల్లో పంపిణీ చేయనున్నారు.
విందు భోజనాలకు రూ.2 లక్షలు..
క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం కానుకలతో పాటు విందు భోజనాలకు నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా విందు భోజనాల కోసం నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలకు రూ.8 లక్షలను, మెదక్ జిల్లాలోని 2 నియోజకవరాగలకు రూ.4 లక్షలను కేటాయించింది. సంబంధిత మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు క్రిస్మస్ కానుకలు విందు భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు గిప్ట్లు..
సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాలకు గానూ పటాన్చెరు మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్కు వెయ్యి చొప్పున 4వేల క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనంలో గిప్ట్ప్యాక్లు చేరుకున్నాయి. ఈ గిప్ట్లను పంపిణీ చేసేందుకు అధికారులు నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలకు చేరిన కానుకలను అధికారులు భద్రపరిచారు. త్వరలో క్రిస్టియన్ పేదలను గుర్తించిన అధికారులు కానుకలు అందజేసేందుకు చర్యలు చేపట్టారు.
మెదక్ జిల్లాలో కానుకల పంపిణీ..
మెదక్ జిల్లాలో 5527 మంది క్రైస్తవులుండగా, వీరిలో రెండువేల మంది క్రైస్తవ పేదలకు కానుకలు పంపిణీ చేయనున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలో ఒకో నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున రెండు వేల మందికి ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన గిఫ్ట్ప్యాక్లను ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలకు చేర్చారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో గిఫ్ట్ లను అందజేస్తారు. మెదక్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు కానుకలను అందజేయనున్నారు.
నాలుగు రకాలు దుస్తువులు..
క్రిస్టియన్ కుటుంబీకులు కొత్తబట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నాలుగు రకాల దుస్తువులతో కూడిన కానుకలు అందిస్తున్నది. గిప్ట్ ప్యాక్లలో పురుషుడికి ప్యాంటు, షర్టు, మహిళలకు చీర, జాకెట్టు కలిగిన గిప్ట్ ప్యాక్లు పంపిణీ చేస్తున్నది. ప్రతి ఏడాది సీఎం కేసీఆర్ అధికారికంగా అందజేస్తున్న క్రిస్మస్ కానుకలపై క్రిస్టియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానుకలు ఇవ్వడం సంతోషకరం…
ప్రభుత్వం క్రిస్టియన్ పేదలకు కానుకలు ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రతి ఏడాది కానుకలతో పాటు విందు భోజనాలు పెట్టారు. ఈసారి కూడా గిప్ట్ తీసుకుని భక్తులు సంతోషకంగా పండుగా జరుపుకోవాలి.
– కె.ఆర్.జాన్, బ్రీమ్ చర్చి పాస్టర్, రాజంపేట, సంగారెడ్డి
పండుగలను గుర్తించడం గొప్పవిషయం..
సర్కారు అన్ని మతాలకు చెందిన పండుగలను గుర్తించడం గొప్పవిషయం. ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకొనే విధంగా ప్రశాంత వాతావరణవ కల్పించడం ఆనందకరం. చర్చిల వారీగా గుర్తించిన పేదలకు గిప్ట్ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం మంచిపని.
– ఏసుపాల్, రాక్ చర్చి, పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాకు చేరిన కానుకలు..
ప్రభుత్వం ఏటా క్రిస్టియన్లలకు కానుకలు అందిస్తున్నది. ఈ ఏడాది కూడా జిల్లాకు 4 వేల గిప్ట్ప్యాక్లు వచ్చాయి. తహసీల్దార్లు గుర్తించిన పేదక్రిస్టియన్లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాం. జిల్లాలోని 5 నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాలకు 4వేల కానుకలు వచ్చాయి. పటాన్చెరు నియోజకవర్గం గ్రేటర్ పరిధిలో ఉన్నందున అక్కడే పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గిప్ట్ప్యాక్ల పంపిణి చేస్తాం.
– మెంచు నగేశ్గౌడ్, ఇన్చార్జి మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సంగారెడ్డి
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ…
క్రిస్మస్ కానుకల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రెండువేల క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నాం. వాటిని పాస్టర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేసి పంచేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఎమ్మెల్యేల సమక్షంలో గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తాం. – జెమ్లానాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మెదక్