సిద్దిపేటరూరల్/మర్కూక్, డిసెంబర్ 6: గులాబీ అధినేత కేసీఆర్ ఉంటున్న మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామస్తులు 540 మంది తొమ్మిది బస్సుల్లో కేసీఆర్ను కలిసేందుకు తరలివెళ్లారు. ప్రజలను చూసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సొంత గ్రామస్తులను చూసిన కేసీఆర్ చేతులెత్తి అభివాదం చేశారు. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కేసీఆర్ను చూసేందుకు ఎర్రవల్లికి బుధవారం సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక గ్రామస్తులు 9 బస్సుల్లో 540 మంది తరలివెళ్లారు. తన స్వగ్రామం నుంచి ప్రజలు వచ్చారనే విషయం తెలుసుకున్న కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి గ్రామస్తులకు చేతులెత్తి నమస్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి జై కేసీఆర్.. దేశ్ కీ నేత అనే నినాదాలు హోరెత్తాయి. మళ్లీ సీఎం కావాలని నినదించారు. సార్ మా సీఎం మీరే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్రావు, తదితర నాయకులు ఉన్నారు.