గుమ్మడిదల, డిసెంబర్17 : హెటిరో పరిశ్రమలోని హెచ్బ్లాక్లో సంచరిస్తున్న చిరుతను చూసిన కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఉన్న హెటిరో ల్యాబ్ పరిశ్రమలో శనివారం జరిగింది. బొల్లారం సీఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి పరిశ్రమ చుట్టూ ఉన్న అడవి ప్రాంతం నుంచి వచ్చిన చిరుత నేరుగా పరిశ్రమలోని హెచ్ బ్లాక్లోకి చొరబడింది. దీంతో విధులు నిర్వహిస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని కార్మికులు పరిశ్రమ హెచ్ఆర్ రవిబాబుకు తెలిపారు. వెంటనే హెచ్ఆర్ రవిబాబు సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, బొల్లారం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చా రు. సీఐ సురేందర్రెడ్డి సిబ్బందితో కలిసి పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారులు శ్రీధర్బాబు, వీరేంద్రబాబు అక్కడికి చేరుకుని హెచ్ బ్లాక్లో ఉన్నది చిరుతపులిగా నిర్ధారించారు.
హెచ్బ్లాక్లో ఉదయం 9 గంటల నుంచి పట్టుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. బ్లాక్ నుంచి బయటకు రాక పోవడంతో ముందు చిరుతకు మేకను ఎరవేయడానికి ప్రయత్నించారు. మూడు బోన్లు, వలలు ఏర్పాటు చేశారు. అయినా రాకపోవడంతో రెస్క్యూ బృందం హెచ్బ్లాక్ గోడలకు రంధ్రం చేశారు. బ్లాక్లో ఉన్న చిరుతపై నీటిపంపుతో ప్రెషర్ చేయడంతో బ్లాక్ నుంచి చిరుత బయటకు వచ్చింది. దీంతో రెస్క్యూ టీం గన్తో మత్తు మందు సూదిని ప్రయోగించి, మూర్చపోయేలా చేశారు. దీంతో చిరుతను రెస్క్యూటీం పట్టుకున్నది. పోలీస్ బృందం, డీఎఫ్వో శ్రీధర్బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు, ఆర్ఐ జయప్రకాశ్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు మంజిత్సింగ్, భవాని, హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ క్యూరేటర్ శ్రీదేవి, రెస్క్యు టీం నవీన్ 15 బృందం 6 గంటల పాటు రిస్క్ చేసి చిరుతను పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ ప్రతినిధులు వచ్చి బోనులో బంధించి చిరుతను జూకు తరలించారు. చిరుత 60నుంచి 70 కిలోల వరకు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మత్తుమందు ఇవ్వడంతో మూర్చలో ఉన్న చిరుత రెండు మూడు గంటల అనంతరం కోలుకున్నది. జూకు తరలించిన అనంతరం వన్యప్రాణుల సంరక్షణ అధికారుల సూచనల మేరకు ఏమైనా గాయాలు ఉంటే చికిత్స చేసిన అనంతరం జూలో పెట్టాలా లేదా అడవిలోకి పం పించాలా అనే విషయాన్ని వారి ఆదేశాల మేరకు నిర్వర్తించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. చిరుత పట్టుపడడంతో పరిశ్రమ కార్మికులు, ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా గడ్డపోతారం అటవీ ప్రాం తం లో చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు.