రామాయంపేట, మార్చి 16: మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం శివారులోని మెట్టుగోడల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున రైతు గొల్ల దేవరాజు పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా పొదలమాటున ఉన్న చిరుత ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లిందని తెలిపాడు.
నెలరోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిందని, వ్యవసాయ పొలాల వద్దలేక డి.ధర్మారం అటవీ ప్రాంతంలోనైనా బోన్లు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. చిరుత వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనలో ఉన్నామని తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టి గ్రామస్తులు, రైతులను కాపాడాలన్నారు. మండలంలోని తొనిగండ్ల అటవీప్రాంతంలో అధికారులు శనివారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.