సంగారెడ్డి : తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం(Chattada SRI Vaishnava Sangam ) అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా( Sangareddy Dist ) చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షులు టి కొండస్వామి, వైస్-ప్రెసిడెంట్ డి మురళి, తోమాల వాణి, ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస స్వామి, సంయుక్త కార్యదర్శి టి మురళి, సంప్రదాయ విభాగం సహాయ కార్యదర్శి ఎం భాస్కరస్వామి, కోశాధికారి శ్రీధర్ ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్ నల్లకుంటలోని చాత్తద వైష్ణవ సంఘం ప్రధాన కార్యాలయం నర్మదా భవన్లో ఈ వేడుక బుధవారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం హాజరయ్యారు. భగవద్రామనుజాస్వామి, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా విద్య, ఆధ్మాత్మికత, సామాజిక చైతన్యం కోసం చాత్తాద శ్రీవైష్ణవ సంఘం చేస్తోన్న కృషిని అభినందించారు. సంఘం ఎన్నికల అధికారులు కొండా వేణుమూర్తి, గజవల్లి సత్యనారాయణ, ధర్మపురి శ్రీనివాస్, సంఘ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వెంకటరమణతో పాటు ఆత్మీయ బంధువులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందని అశ్వాపురం వేణుమాధవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చేయూతకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల వారీగా ఆత్మగౌరవ భవనాల ఏర్పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మరింత ప్రొత్సాహం, అవకాశం కల్పించేలా ఐక్యంగా కృషి చేస్తామని సంగారెడ్డి జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షులు టి కొండస్వామి పేర్కొన్నారు. భగవద్రామానుజుల స్ఫూర్తితో సమసమాజ నిర్మాణంలో సబ్బండవర్గాల ఐక్యవేదిక కోసం చాత్తాద శ్రీవైష్ణవ సంఘం క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు.