సంగారెడ్డి, ఏప్రిల్ 17: సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ ప్రావీణకు ఎమ్మెల్యే చింతాప్రభాకర్తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టులో నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
రెండున్నర సంవత్సరాలుగా ఎడమ కాలువలో చుక్క నీరు విడుదల కాలేదని, దిగువ ప్రాంతాలు అయిన ఘనాపూర్ ఆ యకట్టు ప్రాంతాలకు మాత్రం నీరు అందుతున్నదన్నారు. పుల్కల్, అందోల్ మండలాల్లో విస్తారమైన సాగు భూములు నీటి వసతి లేక బీడుగా మారుతున్నాయన్నారు. రెండు యాసంగి సీజన్లలో రైతులు పంటలు వేయకుండా భూములు బీడుగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల ప్రాజెక్టు నుంచి నీటిని ఎలాంటి సమాచారం లేకుండా విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్, పుల్కల్, మిన్పూర్, ఇసోజీపేట, గంగోజీపేట గ్రామాల్లో వందల ఎకరాల పంటలు మునిగిపోయాయని కలెక్టర్ వివరించారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో పలు పెండింగ్ పనుల వివరాలను కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకొచ్చారు. గిర్మాపూర్ సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు.
నియోజకవర్గంలో కొనసాగుతున్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ గిర్మాపూర్ సాఘిక సంక్షేమ వసతిగృహంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యేకు తెలిపారు. వీరి వెంట నాయకులు జైపాల్రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజయ్ తదితరులు ఉన్నారు.