మెదక్ అర్బన్, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులతో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రపై పౌసుమి బసు జిల్లా కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిఫ్ట్ పథకాలైన ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై, పీఎం గరీబ్ కళ్యాన్ అన్నా యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ పీఎం పోషణ్ అభియాన్, హర్ ఘర్ జల్-జల్ జీవన్ మిషన్ తదితర పథకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు తమ పేర్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార రథాలను ఈనెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారని తెలపారు. జిల్లాకు 10 ప్రచార రథాలు కేటాయించారని అట్టి వాహనాల్లో ప్రధానమంత్రి మెసేజ్ ఆడియో, వీడియోలతో ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల జనవరి 25 వరకు ప్రతిరోజూ ఒక్కో వాహనం రెండు గ్రామ పంచాయతీలకు వెళ్తుందన్నారు. అందుకు రూట్ మ్యాప్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రజలు అట్టి క్యాంపులకు హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, ఎల్డీఎం మూర్తి, డీఎంఅండ్హెచ్ఓ చందునాయక్, డీఏఓ గోవింద్, డీఇఓ రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.