దుబ్బాక, జనవరి 20: శ్రీరాముడు జలకమాచరించిన కూడవెల్లి వాగులో భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కూడవెల్లి రామలింగేశ్వర క్షేత్రం సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట-భూంపల్లి మండలంలో ఉంది. ఏటా మాఘ అమావ్యాస మొదలు ఐదు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చేశారు. మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. సిద్దిపేట, దుబ్బాక డిపోల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
స్థల పురాణం…
శ్రీరామచంద్రుడు రావణాసుర సంహారానంతరం సీతాసమేతంగా కూడవెల్లి మీదుగా అయోధ్యకు పయనమవుతాడు. రావణ సంహారంతో తనకు కలిగిన బ్రహ్మహత్య మహా పాతక ప్రాయశ్చితం కోసం మండవ్య నది (కూడవెల్లి)లో స్నానమాచరించి శివారాధన చేయాలని అగస్త్య మహా ముని శ్రీరాముడికి సూచిస్తాడు. రాముడు తయారు చేసిన ఇసుక లింగం పక్కనే ఆంజనేయుడు తెచ్చిన కాశీ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. శివకేశవులకు భేదం లేదని తెలిపేందుకు ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి రెండువైపులా కూడవెల్లి పెద్దవాగు, చిన్నవాగులు ఇక్కడే కలిసి ఉత్తర వైపున పెద్ద ప్రవాహంగా మారి త్రివేణి సంగమంగా పిలువబడుతోంది.
భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు
జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాం. వాగులో నీటి ప్రవాహం ఉన్నందున భక్తులు స్నానాల కోసం వాగులోకి వెళ్లకుండా స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశాం. వాగులో వలలను ఏర్పాటు చేశాం. గజ ఈతగాళ్లు వాగు పక్కనే అందుబాటులో ఉంటారు.
– పూజారి చంద్రం, ఆలయ కమిటీ చైర్మన్