తమకు రాజకీయాలు అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తామని ఉద్యోగార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్-1 పరీక్ష రద్దు చేసినందున కొంత అయోమయానికి గురైనా, ఉద్యోగార్థులు వారి ప్రిపరేషన్ను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చేసిన పని సబబే అని, ఒకవేళ రద్దు చేయకపోతే అనర్హులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, కాస్త ఆలస్యమైనా అర్హులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్నారు. తాము రాజకీయాలను పట్టించుకోమని, తమ ప్రిపరేషన్ను ఇలాగే కొనసాగిస్తామంటూ ఉద్యోగార్థులు చెబుతున్నారు.
సిద్దిపేట అర్బన్, మార్చి 27 : సిద్దిపేట జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో నిత్యం 500 మంది వరకు ఉద్యోగార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట గ్రంథాలయంలోనే కాకుండా హాస్టల్లో, బీసీ స్డడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా ఉద్యోగార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మంత్రి హరీశ్రావు ఉద్యోగార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ను ఇప్పటికే గ్రంథాలయంలో సమకూర్చారు. డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని సిద్దిపేట గ్రంథాలయంలో అందుబాటులోకి తెచ్చారు. అంతే కాకుండా ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చే 500 మంది ఉద్యోగార్థుల కోసం ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో అందిస్తున్నారు. కేవలం పగటి పూటనే కాకుండా సిద్దిపేట గ్రంథాలయంలో 24 గంటలు చదువుకునే సదుపాయాన్ని సైతం మంత్రి కల్పించారు. మంత్రి హరీశ్రావు నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా జిల్లావ్యాప్తంగా 4 కేంద్రాలు ఏర్పాటు చేసి 1050 మందికి పోలీస్ ఉచిత శిక్షణ అందించారు. గతంలో గ్రూప్-4, డీఎస్సీ, టెట్ పరీక్షలకు కూడా మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అందించారు. ఇవే కాకుండా బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎంతోమంది ఉచిత శిక్షణ పొందుతున్నారు.
మాకు సౌకర్యాలు కల్పించారు..
మేము హైదరాబాద్కు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివే స్థోమత లేదు. మాకు మంత్రి హరీశ్రావు ఇక్కడే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. గ్రంథాలయంలో ఎన్నో వేల పుస్తకాలను మాకోసం సమకూర్చారు. మాకోసం ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం కూడా మంత్రి హరీశ్రావు సార్ ఏర్పాటు చేశారు.
– ఎం.మానస, పోలీస్ అభ్యర్థిని
ప్రతిభావంతులకే కొలువు..
చాలా రోజులుగా సిద్దిపేట గ్రంథాలయానికి వచ్చి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంతో కొంత గందరగోళం నెలకొన్నా మాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. కచ్చితంగా చదువుకొని కష్టపడ్డ అర్హులైన వ్యక్తులకే ఉద్యోగం వస్తుందని మా నమ్మకం. మాకు ఏ అవసమున్నా మంత్రి హరీశ్రావు సార్ చూసుకుంటారు. ప్రిపరేషన్ ఇంకా బాగా కొనసాగిస్తాం.
– బి.కిశోర్, గ్రూప్స్ అభ్యర్థి
ఎస్సై ఉద్యోగానికి ప్రిపేరవుతున్నా..
గతంలో వచ్చిన నోటిఫికేషన్లో వంద శాతం కష్టపడి చదువుకున్న వారికే ఉద్యోగాలు వచ్చాయి. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంది. కొందరు వ్యక్తులు చేసిన పని వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే అనర్హులకు కాకుండా అర్హులకే ఉద్యోగం రావాలన్నది ప్రతి ఒక్క ఉద్యోగార్థి కోరిక. మరింత సాధన చేసి తప్పకుండా ఉద్యోగం సాధిస్తా.
– ఎం.వెన్నెల, పోలీస్ అభ్యర్థిని
రాత్రి వరకు ఇక్కడే చదువుకుంటున్నా..
ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నా. ఉదయం నుంచి రాత్రి వరకు సిద్దిపేట గ్రంథాలయంలోనే చదువుకుంటున్నా. మాకు ఇబ్బంది కలగకూడదనే మంత్రి హరీశ్రావు సార్ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు.వాటిని పట్టించుకోం. ఉద్యోగం సాధించే వరకు ఇదే తపనతో ప్రిపరేషన్ కొనసాగిస్తా. ప్రభుత్వం లీకేజీ విషయంలో త్వరగా స్పందించి అర్హులైన ఉద్యోగార్థుల జీవితాలను కాపాడింది.
– మల్లేశం, గ్రూప్స్ అభ్యర్థి