కల్హేర్, అక్టోబర్ 8: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఊసరవెల్లిలా కల్లబొల్లి మాటలు చెబుతూ గద్దెనెక్కాలని చూస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు కావాలా.. ప్రజల చెంతనే ఉంటూ సంక్షేమంతోపాటు అభివృద్ధి చేస్తున్న సేవకులు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ఆదివారం మండలంలోని జమ్లా తండా, ఖానాపూర్ కే, కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రా రంభించారు. అనంతరం బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, మంత్రి హరీశ్రావు సహాయ సహకారాలతో కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ అందించామన్నారు. ప్రజల గోసను గాలికి వదిలేసి, కాంగ్రెస్ నాయకులు విలాసవంతమైన జీవితం గడిపారని, ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారేందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేయలేదని ప్రశ్నించారు. నల్లవాగు ప్రాజెక్టు కింద రెండు పంటలు పండించుకునేలా కాల్వల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించానన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల, సర్పంచ్లు కిష్టారెడ్డి, కవిత, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు అలీ, ఘని, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
నాగల్గిద్ద, అక్టోబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మోర్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ జనే శిరోమణి, బజార్ శిరోమణి, కట్ట శర్ణప్ప, శాంతప్ప, రాజు, హల్గె హగస్తిన్, నల్ల శిరోమణితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో భారీగా చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. నూతనంగా ఏర్పాటైన నాగల్గిద్ద మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందుపాటిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేత్రి పండరి, వైస్ ఎంపీపీ పండరి యాదవ్, నాయకులు శాంతప్ప, అశోక్రావు పాటిల్, బాలాజి, సురేశ్ చిస్తి, విజయ్కూమార్ తదితరులు పాల్గొన్నారు