జనగామ, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అంత్యక్రియలు మంగళవారం చిల్పూరు మండలం రాజవరంలో అశేష జనావళి కన్నీటి నడుమ ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన గులాబీ శ్రేణులు తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని సంపత్రెడ్డి పార్థివదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పాగాల తండ్రి జయపాల్రెడ్డి, సోదరులు వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి సహా భార్య సుజాత, కుమార్తె సంజనా, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటూ మీ వెన్నంటి ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్రెడ్డి హఠాన్మరణం బాధాకరమన్నారు.
14 ఏండ్లు కేసీఆర్ వెంట ఒక సైనికుడిలా ఉండి పని చేశారని, ఆయన మరణం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలిచి వేసిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంపత్రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్ ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో అధ్యక్షులు, పార్టీ శ్రేణు లు పాగాలకు ఘనంగా నివాళులర్పించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన పాగాల హఠాన్మరణం చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన ఆకస్మిక మృతి రాష్ట్ర వ్యాప్తం గా పార్టీతోపాటు ముఖ్యంగా జనగామ, స్టేషన్ఘన్పూర్ ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు. చిన్న వయస్సులో దూరం కావడం దురదృష్టకరమని, హఠాన్మరణం పట్ల కుటుంబానికి తనతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తరపున సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పాగాల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఆయన కుమార్తె చదువు బాధ్యత సహా ఆర్థిక ఇబ్బందులను సైతం పార్టీ తీరుస్తుందని భరోసానిచ్చారు.
దగ్గర ఉండి అంత్యక్రియలు జరిపించిన పల్లా, కడియం..
పాగాల సంపత్రెడ్డి సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి హుటాహుటిన రాజవరం చేరుకుని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంపత్రెడ్డి అంత్యక్రియల్లో ఎలాంటి లోపాలు జరుగకుండా కుటుంబ సభ్యులకు వెన్నంటి ఉండి వారికి ధైర్యాన్నిచ్చారు. సంపత్రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండ ప్రకాశ్, మార్నెనేని రవీందర్రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీచైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలపాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతిమయాత్రలో పల్లా, కడి యం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, స్నేహితులు పాల్గొన్నారు.
పాగాల మృతి బాధాకరం..
‘ఉద్యమంలో సంపత్రెడ్డి చురుకైన పాత్ర పోషించారు..నిబద్ధత గల నాయకుడిగా సేవలందించారు. ఆయన అకాల మరణం నన్ను కలిచివేసింది. ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బీఆర్ఎస్ కుటుంబానికి, జనగామ జిల్లాకు తీరని లోటు వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థెర్యం కలిగించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా’.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
దురదృష్టకర సంఘటన..
మలిదశ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన పాగాల సంపత్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించాడు. రెండు దశాబ్దాలకు పైగా గులాబీపార్టీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
– కడియం శ్రీహరి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే