ద్దిపేట, ఏప్రిల్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): “ మీ దమ్ము చూపండి. దేనికైనా మేము ఉన్నాం. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి చూసుకుంటాడు. ప్రభుత్వం మనది. పోలీసులకు భయపడకండి అంటూ మెదక్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దామెదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు సమక్షంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు” ఈ వ్యాఖ్యలు ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ కామెంట్స్ చేయడం…దానికి పైగా జగ్గారెడ్డి మీసాన్ని సీఎం రేవంత్రెడ్డి మేలేయడం ..ఇవన్నీ చూస్తే శాంతి భద్రతలు పరిస్థితి ఏంటి…? శాంతి భద్రతలను కాపాడాల్సిన పెద్దలే ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించడం ఎంత వరకు కరెక్టు అంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సిర్గాపూర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి హతమార్చారు.
మొన్నటి శాసనసభ ఎన్నికల ముందు సైతం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి(ప్రస్తుత ఎమ్మెల్యే) కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు (కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు) కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తెలిసిందే. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. నాయకుల మాటలకు పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోరాటం చేయాలి కానీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మంచిది కావని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మెతుకు సీమ గడ్డ హితవు చెబుతోంది.”
ఇటీవల మెదక్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సమక్షంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున పోలీసులకు భయపడవద్దని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. మీ దమ్ము చూపండి ఏమైనా చూసుకుంటానని మాట్లాడారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అర్ధ, అంగ బలాన్ని ఉపయోగించి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతుంది. జగ్గారెడ్డి మాట్లాడిన మరుక్షణమే నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలంలోని సిగార్బొగుడ తండాలోబీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్పై కాం గ్రెస్ నాయకులు దాడులకు దిగారు. పంచాయతీకి పిలిచి రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేశారు. మెదక్ నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగారు. ఇలా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు.
వీటిని అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం నిమ్మకునిరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ సభకు సైతం ఏమాత్రం సహకరించలేదు. ఆ సభలో పోలీసుల తీరును ఎండగట్టినప్పుడు ప్రజలు కేరింతలు కొట్టారు. అంటే పోలీసులపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవ్వరికి కూడా హానిచేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే చిల్లర రాజకీయాలు చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఎంతకైనా దిగజారి అల్లర్లు సృష్టించి గెలుపొందాలని కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నది. పైగా ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు సైతం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పనిచేస్తున్న క్యాడర్ను లెక్క చేయడం లేదన్న అసంతృప్తి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. ఇన్నాళ్లు జెండా మోసిన మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన నేతలకు పెత్తనం అప్పగించడంపై పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు.