కొండాపూర్, ఏప్రిల్ 22: మెదక్ ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఎగిరేది గులాబీ జెండేనని, మెతు కు గడ్డ గులాబీ అడ్డా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లేపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ నిలబెట్టిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. 20 రోజులు కష్టపడి పనిచేయాలని, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ప్రజలకు తెలుపాలని హరీశ్రావు కార్యకర్తలకు సూచించారు.
గెలిచిన 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి సీఎం పీఠంపై కూర్చున్నారన్నారు. హామీలు అమలుచేయడం చేతకాకపోతే దిగిపోవాలన్నా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆరోగ్యశాఖ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజేశ్వర్రావుదేశ్పాండే, డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యం, డాక్టర్ శ్రీహరి, జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మ్యాకం విఠల్, బీఆర్ఎస్ నాయకులు సత్యనందం, మల్లాగౌడ్, గోవర్ధన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.