రైతులు, మహిళలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇలా.. సమాజంలోని అన్నివర్గాల వారు లబ్ధిపొందేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ అనేక వరాలు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నదని ప్రజలు, రైతులు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టో ప్రకటించడంతో ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం సంబురాలు జరుపుకొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడానికి ఈ మేనిఫెస్టో బాటలు వేస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
రామాయంపేట/నిజాంపేట/చేగుంట/కొల్చారం/నర్సాపూర్/చిలిపిచెడ్/, అక్టోబర్ 15 : ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని సబ్బండ వర్గాల ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మహానాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కడేనని తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
గౌరవంగా బతుకుతున్నాం
గతంలో ఏ ప్రభుత్వం రైతులను, దివ్యాంగులను పట్టించుకోలేదు. దివ్యాంగుల పింఛన్ ఇటీవలే రూ.3 వేల నుంచి రూ.4,016 పెంచడం వల్ల ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా ఎన్నికల కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ.6 వేల పెంచడం హర్షించదగ్గ విషయం. దివ్యాంగుల మేలు కోరే కేసీఆర్ సారే మళ్లీ మూడవ సారి భారీ మోజార్టీతో గెలువాలి.
– కట్లే చంద్రం, కర్నాల్పల్లి, చేగుంట మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
గతంలో ఎవుసాయం చేయాలంటే వానకాలం పూనంగనే షావుకార్ల దగ్గరకి పెట్టుబడికి చెప్పులరిగేలా తిరిగేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం పంటకు ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నాడు. ఇప్పుడు పంట పెట్టుబడి సాయాన్ని (రైతుబంధు)ఎకరానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.16వేలకు పెంచుతాననడం హర్షణీయం. రైతుల పాలిట రైతు బాంధవుడు సీఎం కేసీఆర్.
– వి.నర్సింహులు, అప్పాజిపల్లి రైతు, కొల్చారం
కాంగ్రెస్ బీజేపోళ్లును నమ్మెద్దు
సీఎం కేసీఆర్ సార్ ఇంట్ల మనిషిలెక్క మనకు తెల్లకార్డు ఉన్న వాల్లందరి పేదోళ్లకు రూ.5 లక్షల బీమా చేస్తడంట. అన్నమాట తప్పడు మన కేసీఆర్ సార్. గిప్పుడు వచ్చే ఎలక్షన్ల్ల కూడా మల్ల కేసీఆర్ సార్నే గెలిపిద్దం. గిప్పుడు గా కాంగ్రెస్ వాళ్లు, గీ బీజేపోళ్లు మస్తుగ జెప్తరు గాని జేయరు. వాల్లను మనం నమ్మెద్దు. వాల్లను గిట్ల నమ్మి మనం చేతికి, పువ్వు గుర్తుకు ఓట్లు గిట్ల ఏస్తే మనం ఎందుకు పనికిరానొల్లమవుతం. మల్ల మనం సీఎం కేసీఆర్ సార్నే గెలిపించుకోవాలె.
– కుమ్మరి నారాయణ, కోనాపూర్ రామాయంపేట
గ్యాస్ ధర తగ్గింపు హర్షణీయం
కేంద్రంలో బీజేపోళ్లు వచ్చినంక గ్యాస్ సిలిండర్ ధరలు మస్తుగా పెంచిన్రు. మాలాంటి పేదోళ్లు గ్యాస్ సిలిండర్ ఎట్ల కొంటరు అని ఆలోచించకుండా ఇష్టమెచ్చినరీతిన ధరను మన సీఎం కేసీఆర్ 400 రూపాలకే ఇస్తామనడం శానా అనందం ఉంది. గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. సంపాదన ఖర్చులకే పోతుంది. సామాన్యుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే మల్ల రావాలె.
– అవుసుల నాగరాణి, గృహిణి, వెల్దుర్తి
రైతు కష్టాలు తెలిసిన దేవుడు కేసీఆర్
రైతుల కష్టాలు తెలిసిన దేవుడు సీఎం కేసీఆర్ సారే. అందుకే రైతుల కోసం ఎన్నో పథకాలను ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ధాన్యాన్ని కొం టూ రైతుల ఖాతాలలో డబ్బు లు జమచేస్తుండు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చి న కేసీఆర్ సారు, ఇప్పుడు ఏడాదికి ఒకసారి పెంచుతూ రూ.16 వేలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇచ్చినట్టుగానే ఇకముందు ఇస్తాడనే నమ్మకం ఉంది. రైతులను ఆదుకుంటూ అండగా నిలుస్తున్న కేసీఆర్ మళ్లీ గెలుస్తాడు.
– ఎర్రోళ్ల నాగులు, రైతు, శేరీల
బీడీ కార్మికులకు ఎంతో మేలు
ఆసరా పెన్షన్ పెంచడం వల్ల బీడీ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో మమ్మల్ని పట్టించున్న నాథుడే లేడు. సీఎం సారుకు రుణ పడి ఉంటాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా అందించడం ఆ కుటుంబానికి నిజమైన ధీమా కల్పిస్తుంది. ప్రభుత్వమే మొత్తం చెల్లించి బీమా ధీమా కల్పించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం పేదలందరి బాగోగులు చూస్తూ అందరికీ భరోసా కల్పిస్తున్నారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ సారే గెలవాలి.
– కుమ్మరి శ్యామల, బీడీ కార్మికురాలు, దామరచెర్వు
రైతుల పాలిట దేవుడు కేసీఆర్
రైతులకు ఎకరానికి రైతుబంధు పథకం ఇచ్చి ఆదుకుంటున్న దేవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతుబీమా, రైతుబంధు పథకాలతో అన్నదాతలకు అండగా నిలిచిండు. ఈ ఎన్నికల్లో మా రైతులకు ఇచ్చిన హామీతో మరో మారు తెలుస్తుంది. ఇంతకు ముందు ఉన్న పార్టీలు ఎప్పుడూ రైతులకు పొలం పెట్టుబడి సాయం చేసింది లేదు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారమివ్వాలి. ఎకరానికి రెండు ఎరువు బస్తాలు, రైతుబంధు రూ.16 వేలు చేస్తానంటుంన్న కేసీఆర్ సారే మళ్లీ గెలవాలి, రైతులకు భరోసాగా నిలవాలి.
– చౌటకూర్ చంద్రశేఖర్రెడ్డి, చండూర్ గ్రామం, చిలిపిచెడ్
రైతులంతా కేసీఆర్ దిక్కులనే ఉంటం
కేసీఆర్ సార్ మల్ల రైతుల కోసం రైతుబంధును వంతుల వారీగా ఏడాదికి రూ.16 వేలు చేస్తానని హామీ ఇయ్యడం శానా సంతోషంగా ఉంది. రైతులంతా కేసీఆర్ దిక్కులనే ఉంటం. మాకు పంటలేసుకుందామంటే అప్పు ఇచ్చెటోళ్లు లేకుండిరి. గిప్పుడు కేసీఆర్ సార్ వచ్చుడుతోనే మాకు అప్పులు లేకుండా తొమ్మిదేండ్ల కానుంచి రైతుబంధు ఇస్తుండు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ.12వేల నుంచి 16 వేలు ఇస్తనంటుండు. ఇంక మాకేం బాధ లేదు. మా ఇంట్లో ఉన్నొల్లమందరం కేసీఆర్ సార్కే ఓటేసి గెలిపిస్తం.
– లంబాడి బాల్య, కోనాపూర్ గిరిజన తండా రామాయంపేట
జీవితాంతం రుణపడి ఉంటాం
గత ప్రభుత్వాలు మా దివ్యాంగులను ఏ మాత్రం పట్టించుకోలేదు. మొన్ననే సీఎం కేసీఆర్ సార్ను మేం అడుగకున్నా రూ.3,016 ఉన్న పింఛన్ను రూ.4,016 లు పెంచి బ్యాంక్ అకౌంట్లో వేస్తుండు. సీఎం కేసీఆర్ సార్ ప్రకటించిన మేనిఫెస్టోలో దివ్యాంగులకు మంచి వార్తను అందించిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో దివ్యాంగుల పింఛన్ను ఏటేటా పెంచుతున్న సీఎం కేసీఆర్ సార్కు మా జీవితాంతం రుణపడి ఉంటాం.
– రామస్వామి, నిజాంపేట దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు,
కేసీఆర్పై పూర్తి నమ్మకం ఉంది
నిరుపేద ప్రజలను ఆదుకునే సంకల్పంతో సీఎం కేసీఆర్ నూతన మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ.6 వేల వరకు పింఛన్ పెంచడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే మాలాంటి దివ్యాంగులు న్యాయం జరుగుతదనే నమ్మకం ఉంది. ఎందుకంటే, మేం అడకగ ముందే వెయ్యి రూపాయల ఇటీవలే పింఛన్ పెంచిండు. ఇప్పుడు మళ్లీ రెండు వేలు పెంచుతానని అంటున్నాడు. మళ్లీ కేసీఆర్ సార్నే గెలిపించుకుంటం
– చాకలి మహేశ్, దివ్యాంగుడు, నర్సాపూర్
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలే
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. గత 60 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి, రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఇప్పుడు రైతు బంధును ఎకరానికి రూ.16 వేలు పెంచడం హర్షించదగ్గ విషయం. రైతుల మేలు కోరే ముఖ్యమంత్రిని మళ్లీ గెలుపించుకుంటం.
– గడ్డం భిక్షపతి, రైతు, జెప్తిశివునూర్, నార్సింగి
బీమాతో పేద కుటుంబాలకు ధీమా
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా నిరుపేద కుటుంబాలకు బీమా పథకంతో ఎంతో ధీమా ఏర్పడుతుంది. చేతి కష్టం చేసుకుంటూ కూలీ, నెల జీతాలకు ఎదురుచూసే ఎంతో మంది నిరుపేదలకు బీమా పథకం అండగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు రైతుబీమా పథకంతో ఎంత భూమి ఉన్న రూ.5 లక్షలు ఇచ్చి వాళ్ల కుటుంబాలను ఆదుకుంటుండు. సీఎం కేసీఆర్ మరోమారు గెలిచి సీఎం కావడం ఖాయం.
– కానుకంటి సంతోశ్కుమార్, ఉప్పులింగాపూర్