సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి రోడ్లపై బైఠాయించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లజెండాలు పట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ఈడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సిద్దిపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్, నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నారాయణ్ఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జహీరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, ఎం పీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం అంటూ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మం డిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని వారు విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఒకరోజు ముందే కావాలని మాజీ సీఎం కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, ఎన్ని అరెస్టులు చేసినా ఎంత మంది ఈడీలు, మోడీలు వచ్చినా భయపడేది లేదని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.