సిద్దిపేట, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతోంది.ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందున్నది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా ఈపార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం కీలకంగా మారుతుంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీ ఆధారంగానే ఆనాడు విజయశాంతి విజయం సాధించింది. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ సిద్దిపేట మెజార్టీపైనే అందరి దృష్టి ఉంటుంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోరు నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలోనే ఉంది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ తనదైన శైలీలో ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ప్రతి మండల కేంద్రాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు వేలేటి రోజాశర్మ, హేమలత తదితర ముఖ్యనాయకులు నిత్యం ప్రచారంలో ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అనేక విజయాలను అందించింది మెతుకు గడ్డ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014, 2018, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యతను కనబర్చింది. 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది. 2014,2019 ఎన్నికల్లో రెండు సార్లు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ స్థానాలకు 2014లో 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, జహిరాబాద్, నారాయణఖేడ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణంతో మరణించగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి గెలుపొందారు. దీంతో 10కి 9చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల ఫలితాల్లో 10 శాసనసభ స్థానాలకు 9 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తదనంతరం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
2020లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో స్పల్ప ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 1,079 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అన్ని మండల పరిషత్లతో పాటు, గ్రామాల సర్పంచ్లు ఇలా అన్నింటా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో 95 శాతానికి పైగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పదిశాసనసభ స్థానాలకు ఏడు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2014లో రెండు, 2018లో ఒక స్థానం, 2023లో మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పార్లమెంట్ ఫలితాలను చూస్తే 2004 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుచుకుంటూ వస్తుంది. 2004లో ఎ.నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014లో కె.చంద్రశేఖర్రావు, 2014(ఉప ఎన్నికలో) కొత్త ప్రభాకర్రెడ్డి, 2019లో కొత్త ప్రభాకర్రెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి) నుంచి ఎన్నికయ్యారు.
1952లో మెదక్ లోక్సభ ఏర్పడింది. 1952లో జయసూర్య (పీపుల్స్ డెమోట్రిక్ ఫ్రంట్ (హైదరాబాద్), 1957, 1962లో పి.హన్మంత్రావు, 1967లో సంగం లక్ష్మీబాయి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ), 1971 మల్లికార్జున్గౌడ్ (తెలంగాణ ప్రజా సమితి) 1977లో మల్లికార్జున్గౌడ్, 1980లో ఇందిరాగాంధీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ) 1984లో మాణిక్రెడ్డి (టీడీపీ) 1989, 1991, 1996, 1998లో ఎం.బాగారెడ్డి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ), 1999లో ఏ.నరేంద్ర (భారతీయ జనతా పార్టీ), 2004లో ఎ.నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014లో కె.చంద్రశేఖర్రావు, 2014(ఉప ఎన్నికలో) కొత్త ప్రభాకర్రెడ్డి, 2019లో కొత్త ప్రభాకర్రెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి) నుంచి ఎన్నికయ్యారు.
మెదక్ లోక్సభ పరిధిలో ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒకచోట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. గజ్వేల్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, సిద్దిపేట నుంచి తన్నీరు హరీశ్రావు, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్రెడ్డి, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక మిగిలిన మెదక్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒక్క స్థానం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో గులాబీ పార్టీకి కంచుకోట అని చెప్పాలి. మెదక్ పార్లమెంట్ స్థానంలో ఎగిరేది కూడా గులాబీ జెండానే… 2004 నుంచి వరుసగా బీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తుంది.