ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలు, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 30 పీహెచ్సీలుండగా, కొత్తగా మరో మూడు మంజూరు చేసింది. అమీన్పూర్, వట్పల్లి, తెల్లాపూర్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఒక్కో పీహెచ్సీని రూ.1.43 కోట్లతో నిర్మించేందుకు నిధులు సైతం మంజూరు చేసింది. మూడు దవాఖానలు అందుబాటులోకి వస్తే లక్షమందికిపైగా వైద్యసేవలు చేరువకానున్నాయి. ఉత్తమ పనితీరు కనబర్చిన సంగారెడ్డిలోని మార్క్స్నగర్ యూపీహెచ్సీ, న్యాల్కల్ పీహెచ్సీలకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్ను ప్రకటించడంతో అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 29
సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందకు పెద్దపీట వేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, 173 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది. తాజా గా జిల్లాకు మరోమూడు పీహెచ్సీలను మంజూరు చేసింది. అమీన్పూర్, వట్పల్లి, తెల్లాపూర్లో కొత్త పీహెచ్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీంతో ఆయా మండలాల పరిధిలోని జనాభాకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాలోని నియోజకవర్గాల్లో కొత్త పీహెచ్సీలు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరారు. ఎమ్మెల్యేల వినతి, ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు కొత్త పీహెచ్సీలు, పల్లె దవాఖానలను సీఎం కేసీఆర్ మంజూరు చేసేలా మంత్రి హరీశ్రావు చర్యలు తీసుకున్నారు. ఒక్కో పీహెచ్సీకి రూ.1.43 కోట్ల నిధులు మంజూరు చేసింది. త్వరలోనే రెవెన్యూ అధికారులు కొత్త పీహెచ్సీ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించనున్నారు.
మార్స్స్నగర్, న్యాల్కల్ పీహెచ్సీలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్లు
సంగారెడ్డిలోని మార్క్స్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్(NQAS) సర్టిఫికెట్ను తాజాగా పొందాయి. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ ఉత్తమ పనితీరు కనబర్చే పీహెచ్సీలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ను మంజూరు చేశారు. పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలతోపాటు 8 రకాల పారా మీటర్లను పరిశీలించారు. అనంతరం ఎన్క్వాస్ సర్టిఫికెట్ను కేంద్రం మంజూరు చేస్తుంది. సంగారెడ్డిలోని మార్క్స్నగర్ యూపీహెచ్సీ, న్యాల్కల్ పీహెచ్సీలు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఎన్క్వాస్ సర్టిఫికెట్ పొందాయి. ఏటా రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు ఈ పీహెచ్సీలకు కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ నిధులు ఇవ్వనున్నది.