గజ్వేల్, జూన్ 23: రాజకీయ కక్షతో ఇంటి నిర్మాణం కూల్చివేయడం తగదని, సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల బాధితులకు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్కు చెందిన మాజీ జడ్పీటీసీ రాములుకు చెందిన కూల్చిన ఇంటి స్లాబ్ను మంగళవారం ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఓపెన్ ప్లాట్లో ఇంటి నిర్మాణం చేపడుతుంటే, అధికార పార్టీ నాయకుడు రూ.5లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి నిర్మాణం కోసం కొట్టిన స్లాబ్ డబ్బాను కూల్చివేయించారని ఆరోపించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇండ్లు కోల్పోయిన బాధితులు ప్రస్తుతం కొత్తగా ఇండ్లను నిర్మించుకుంటుంటే, వాటిని అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు అడ్డుకోవడం దుర్మార్గం అని విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ.12లక్షల పరిహారం ఇస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బాధితుల ఉసురు తగులుతదని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే బాధితులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు మల్లన్నసాగర్ భూబాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం, ప్యాకేజీలు, ప్లాట్స్ను వెంటనే అందించాలని వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, మండల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్మీరా, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.