‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. మొదట 1952లో నుస్తులాపూర్ నియోజకవర్గం ఉండగా పీడీఎఫ్ అభ్యర్థి సింగిరెడ్డి వెంకట్రెడ్డి గెలుపొందారు.అనంతరం ఇందుర్తి ఆ తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల కంచుకోటలో బీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వొడితెల సతీశ్కుమార్ 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గానికి నిధుల వరద పారింది. కరువు కాటకాలతో అల్లాడే హుస్నాబాద్ నియోజకవర్గం వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. మిషన్ కాకతీయతో చెరువుల పునర్నిర్మాణం జరిగింది. ఎండకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని మహిళలు రోడ్లపైకి వచ్చేది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథ హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చింది. ఇంటి ముందుకు శుద్ధిజలం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి ఆజ్యం పోసింది ఇక్కడే… రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసింది ఇక్కడే… తెలంగాణలో మొట్టమొదటి ఎన్కౌంటర్ జరిగిందీ ఇక్కడే… దివంగత దేశ ప్రధాని వీవీ నర్సింహారావు ఇక్కడి వాడే… ఆసియాలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్తూపం కట్టింది ఇక్కడే… తెలంగాణ ఉద్యమంలోనూ కదం తొక్కి ఉద్యమాన్ని పూరించింది ఇక్కడి ప్రజలే… కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుగాంచిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎదుగుతోంది…అదే హుస్నాబాద్ నియోజకవర్గం. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. మొదట నుస్తులాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం.. అనంతరం ఇందుర్తి నియోజకర్గంగా ఆ తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంగా మారింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల కంచుకోటలో బీఆర్ఎస్ పాగా వేసింది.
1952లో నుస్తులాపూర్ నియోజకవర్గం ఏర్పడగా, ఇందులో ఇప్పటి కరీంనగర్లోని తిమ్మాపూర్ మండలంతో పాటు చిగురుమామిడి, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాలతో కలిపి ఉండేవి. 1957లో ఇందుర్తి నియోజకవర్గంగా మారినప్పుడు హుస్నాబాద్, చిగురుమామిడి, బెజ్జంకి, కోహెడ మండలాలు ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దీనిని ఆరు మండలాలతో కలిపి హుస్నాబాద్ నియోజకవర్గంగా మార్చారు. ఇందులో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ మండలాలు ఉన్నాయి. అక్కన్నపేట మండలం కొత్తగా ఏర్పడటంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏడు మండలాలు ఉన్న రెండో అతిపెద్ద నియోజకవర్గంగా మారింది. 2011జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గం జనాభా 3,05,333, మొత్తం ఓటర్లు 2,11,115 మంది ఉన్నారు. ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
నుస్తులాపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మినహా మిగతా ప్రతి సారి ప్రభుత్వేతర ఎమ్మెల్యేలను గెలిపించడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకతగా చెప్పొచ్చు. 1952లో నుస్తులాపూర్ నుంచి పీడీఎఫ్ అభ్యర్థి సింగిరెడ్డి వెంకట్రెడ్డి, 1957లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి చామనపల్లి చొక్కారావు విజయం సాధించగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మీకాంతరావు విజయం సాధించగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1972లో సీపీఐ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి, 1978లో సీపీఐ అభ్యర్థి దేశిని చినమల్లయ్య గెలిచినప్పుడూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. 1983లో కాంగ్రెస్ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మీకాంతారావు గెలువగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి దేశిని చినమల్లయ్య వరుసగా మూడుసార్లు గెలిచినప్పుడు కాంగ్రెస్, టీడీపీలు పాలనలు ఉన్నాయి. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్ గెలుపొందగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. 2004లో సీపీఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. 2009 నుంచి మాత్రం నియోజకవర్గం దశ తిరిగిందని చెప్పొచ్చు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ గెలుపొందగా.. ఈ ఇద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. విపక్ష ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నందున నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పొచ్చు. మొత్తం 14సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు పీడీఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు సీపీఐ, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో నియోజకవర్గానికి నిధుల వరద పారిందని చెప్పొచ్చు. కరువు కాటకాలతో అల్లాడే హుస్నాబాద్ నియోజకవర్గం వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. సాగునీటి కోసం అల్లాడే మెట్ట హుస్నాబాద్ సస్యశ్యామలం కాబోతోంది. నియోజకవర్గంలో రూ.5వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు, రూ.4వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల అమలయ్యాయి. మొత్తంగా రూ.9వేల కోట్లకు పైగా అభివృద్ధి జరిగింది. మహాసముద్రంగండి నిర్మాణం, శనిగరం, సింగరాయ ప్రాజెక్టులకు మరమ్మతులు జరగడం, ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్బండ్గా రూపుదిద్దుకోవడం, మిషన్ కాకతీయతో చెరువుల పునర్నిర్మాణం జరిగింది. ఆయా నీటి వనరుల ఆయకట్టు ప్రాంతాలు పచ్చని పంటలతో అలరారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా సగటును ఒక్కో గ్రామానికి రూ.60లక్షలకు పైగా నిధులు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగింది. ఎండకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చే మహిళలు గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ఎక్కడా కనిపించలేదు. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు మిషన్ భగీరథ హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చింది. ఇంటి ముంగిటికి శుద్ధజలం వచ్చింది. ప్రజావసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరగడంతో కరువు ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిందనడంలో సందేహం లేదు.