సిద్దిపేట, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో హరీశ్రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ …నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.ప్రతి ఒక నాయకుడు, కార్యకర్త కొంత సమయం కేటాయించి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈసారి సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 50 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతోందని తెలిపారు. స్పాట్ లో లైవ్ ఫొటో తీసుకోవడంతో పాటు ఓటరు వివరాలు అకడే నమోదవుతాయని తెలిపారు.
మెంబర్ షిప్ డ్రైవ్ అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు.క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఈ మెంబర్ షిప్ డ్రైవ్ పూర్తి చేస్తే, అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించేలా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా, గ్రామాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున.. రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు.
సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సమన్వయకర్తలు, తదితరులు పాల్గొన్నారు.