జహీరాబాద్, డిసెంబర్ 4: జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్రావు రెండోసారి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 34వేల మెజార్టీతో విజయం సాధించారు. 2023లోమూడోసారి శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై 12,790 ఓట్లు మెజార్టీ సాధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని జహీరాబాద్ పట్టణం, మండలం, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకొనేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించారు.
సామాన్యవ్యక్తిగా ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఎప్పుడూ స్థానికంగా ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు సమాచారం తెలిపి సమస్యను పరిష్కరించే వారు. క్యాంపు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మాట్లాడే వ్యక్తిగా గుర్తింపు వచ్చింది. నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్గా ఏర్పడినప్పుటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్థానికేతలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉంచుతున్నది. స్థానిక కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేసినా చివరకు పార్టీ అధిష్టానం స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నారు. దీంతో స్థానిక కాంగ్రెస్ ఎస్సీనేతలు స్థానికేతరులను ఓడించేందుకు ముందుకొచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు.
మాణిక్రావు గెలుపు వెనుక హారీశ్రావు…!
మాణిక్రావును గెలిపించేందుకు మంత్రి హరీశ్రావు కృషి చేశారు. పలుమార్లు జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మాట్లాడారు. స్థానిక వ్యక్తి మాణిక్రావును గెలిపించాలని కులసంఘాలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్లో గులాబీ జెండాఎగరాలని తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ నాయకులతో మాట్లాడి సూచనలు చేశారు. హరీశ్రావు సూచనలతోనే జహీరాబాద్లో మాణిక్రావు విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. మాణిక్రావు గెలుపుకోసం రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తీవ్ర ప్రయత్నలు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రచారం చేశారు. కొనింటి మాణిక్రావు గెలుపొందిన వెంటనే జహీరాబాద్ పట్టణంలో ప్రధానరోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు భారీర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే మాణిక్రావు ధన్యవాదాలు తెలిపారు.