సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెదక్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. ఇదే సభలో మంత్రి హరీశ్రావు పదికి పది స్థానాలు గెలుచుకొని సీఎం
కేసీఆర్కు కానుక ఇద్దామని పిలుపునిచ్చారు. ‘మా మద్దతు
హరీశ్రావుకే మా మద్దతు’ అంటూ గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టణాలు, గ్రామాలను చుట్టేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. పథకాలు, అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలతో ప్రతిపక్ష పార్టీలను డైలమాలో పడేస్తున్నారు.
బీఆర్ఎస్ జోరును చూసి కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు మొదలైంది.
ఆ పార్టీ శ్రేణుల్లో నిర్వేదం నెలకొంది.
– సిద్దిపేట, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాల పురిటిగడ్డ..అభివృద్ధి పూదోటలో గులాబీ పార్టీ జోరుమీదున్నది. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ..తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల ముందు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలతో పాటు హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల్లో విజయం సొంతం చేసుకునేలా పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆర్థిక. వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలతో ప్రతిపక్ష పార్టీలను డైలమాలో పడేస్తున్నారు.
ఎక్కడ బహిరంగ సభ జరిగినా మహిళలు,యువత, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే..మరో వైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ప్రతి పక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల ముందు చర్చ పెడుతున్నారు. మూడోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వ మే..హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతారని ప్రజలకు తన యాసలో చెప్పి ఆకట్టుకుంటున్నారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ సమన్వయం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకుపోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మనం చేసిన అభివృద్ధిని గ్రామాల్లో ప్రజలు ముందు చర్చ పెట్టాలి అని చెబుతున్నారు. మంత్రి హరీశ్రావు దిశానిర్దేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు మీదున్నది. బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ జోరును చూసి ప్రతి పక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వణుకు పుట్టుకుంది. ఆ పార్టీ శ్రేణుల్లో నిర్వేదం నెలకొన్నది. అందరికన్నా ముం దే బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించి ప్రతి పక్షపార్టీలను డైలమాలో పడేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటనే లేదు. దీంతో ప్రతి పక్షపార్టీల నేతల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేయడంతో వారంతా వారి వారి నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల మధ్యనే ఉండి పోతున్నారు.
గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు, దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే సతీశ్కుమార్, మెదక్ నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఆందోల్ నుంచి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నారాయణ్ఖేడ్ నుంచి భూపాల్రెడ్డి, జహీరాబాద్ నుంచి మాణిక్యరావు, సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిలను పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. నర్సాపూర్, జనగామ స్థానాలకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థుల ప్రకటించిన రోజు నుంచి నిత్యం ప్రజల మధ్యనే అభ్యర్థులు ఉంటున్నారు.అభ్యర్థుల ప్రకటన అనంతరం మెదక్లో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్స వాలు చేశారు.
అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలు గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభతో మంచి ఊపులో ఉన్న పార్టీ అభ్యర్థులు నియోజక వర్గాల్లో తిరుగుతూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ బంధు, గృహలక్ష్మి,దళిత బంధు,నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. వచ్చే రెండు నెలలు కీలకం కావడంతో ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని ముందుకువెళ్తున్నారు.
రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ భారీ విజయం సొంతం చేసుకొని సీఎం కేసీఆర్కు కానుకగా ఇచ్చే లక్ష్యంగా ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు విస్తృత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాలు తిరుగుతూనే ఉమ్మడి జిల్లాను చుట్టేస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ స్థానికంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.ఎక్కడికక్కడ ప్రతి పక్ష పార్టీలను ఎండగడుతూ మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారని నిలదీస్తున్నారు.
మా ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కండ్ల ముందు ఆవిష్కతమైన విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతి పక్ష పార్టీలను తన మాటలు, తన యాస, తన అభివృద్ధి లెక్కలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. సాగు నీరు, కరెంట్, విద్య, వైద్యం, జిల్లాల ఏర్పాటు, రైతు సంక్షేమం, తదితర పథకాలను ప్రజల ముందు చర్చ పెడుతున్నారు. మీ ప్రభుత్వాల హయాంలో ఇవన్నీ చేయాలనే సోయి ఎందుకు రాలేదు అని కాంగ్రెస్, బీజేపీలను నిలదీస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో తాము చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెట్టి..మళ్లీ మమ్మల్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు ప్రజలను కోరుతున్నారు. తన ప్రయాణంలోనే పార్టీ అభ్యర్థులు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నేతలు, ముఖ్యనాయకులు, ఇతర విభాగాల నేతలతో తరుచూ మాట్లాడుతూ పార్టీని సమన్వయం చేస్తూ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటి కప్పుడు జిల్లాలో పార్టీ కార్యక్రమాలపై మానిటరింగ్ చేస్తున్నారు. మరో వైపు ప్రతి పక్ష పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను బీఆర్ఎస్లోకి చేర్చించుకుంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల నుంచి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. రెండు రోజలు కిందటనే మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మంత్రి హరీశ్రావు, మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి నచ్చక చాలా మంది నేతలు పెద్ద ఎత్తున ఆపార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు.ఇప్పటికే మెదక్ నియోజకవర్గం అంతటా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆపార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పార్టీ కోలుకొని విధంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడుతున్నది.
ఉన్న కొద్ది పాటి క్యాడర్ను కాపాడుకోవడం ఆ పార్టీ నేతలకు కష్టంగా మారింది. రోజు రోజుకు పార్టీ నేతలు, కార్యకర్తలు చేజారుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. అసెంబ్లీ టికెట్లు ఆమ్ముకోవడంతో ఆపార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. డబ్బు సంచులు ఉన్నోళ్లకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడంతో క్రమశిక్షణతో పని చేసిన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఆ పార్టీ టికెట్లు ప్రకటిస్తే మరింత మంది ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమచారం. ఇక బీజీపీ పార్టీ జిల్లాలో నామమాత్రమే అని చెప్పాలి. దుబ్బాక నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావు తీరు నచ్చక ఇప్పటికే చాలా మంది నేతలు, పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిపోయారు. ఎలాగు ఓటమి తప్పదని చెప్పి ఇప్పటి నుంచి ఎన్నికల తాయిలాలకు రఘునందన్రావు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి దుబ్బాకలో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంటున్నది.