జనగామ, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : గెలుపే లక్ష్యంగా ఇప్పటికే గ్రామాలను చుట్టేసిన బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి రెండురోజులుగా ము న్సిపల్ వార్డుల్లో ప్రతి వీధికి వెళ్లి జనంతో మమేకమవుతూ.. ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా జనం వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ‘మీ ప్రాంత బిడ్డను నన్ను ఆదరించి అకున చేర్చుకొని గెలిపిస్తే రుణం తీర్చుకుంటా’ అంటూ పట్టణ వార్డుల్లో ప్రతి గుమ్మం తడుతూ అభ్యర్థిస్తున్నారు. బజ్జీలు వేస్తూ.. ఇస్త్రీ చేస్తూ వినూత్న ప్రచారంతో గులాబీ కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. పల్లాకు కాలనీల్లో మహిళలు తమ ఇండ్ల ముందు స్వాగత ముగ్గులు వేసి మంగళహారతులు పట్టి బొట్టుపెట్టి దీవెనలు అందిస్తున్నారు. జనగామ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని 2, 3, 4 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, పగిడిపాటి సుధ ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసుల జై కేసీఆర్, జై పల్లా, జయహో బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఇంటికెళ్లి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందిస్తూ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చిన సీఎం కేసీఆర్ను దీవించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే జనగామను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పెద్దసారుకు దగ్గరగా ఉండే తనను ఎన్నికల్లో గెలిపిస్తే జనగామను అద్దంలా చేస్తానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తలమానికంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. దళిత, మైనార్టీ, రైతాంగ వ్యతిరేక బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని, ఆయనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని అన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జనగామ ఎట్లుండె.. బీఆర్ఎస్ హయాంలో ఎట్లుందో ప్రజలు గమనించాలని కోరారు. నన్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మీరు ఆశీర్వదిస్తే పెద్దసారు కేసీఆర్తో కొట్లాడి మరీ సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో జనగామ, చేర్యాల మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణలో ముస్లిం, మైనార్టీ విద్యార్థులు చదువుకొనేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. జనగామ బీఆర్ఎస్ అడ్డా అని 2001లోనే ఇక్కడ ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిన గడ్డ అని గుర్తు చేశారు.