సంగారెడ్డి(నమస్తే తెలంగాణ)/అందోల్, నవంబర్ 18: అందోల్ గడ్డ గులాబీ అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా.. స్వరాష్ట్రంలో గులాబీ సైనికులు ఆ ఆ కోటను బద్దలు కొట్టారు. ఉద్యమాల పురిటిగడ్డ అందోల్కు ఉమ్మడిరాష్ట్రంలో, ఇటు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉన్నది. స్వాతంత్య్ర ఉద్యమం మొదలుకొని తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు వేదికగా అందోల్ గడ్డ నిలిచింది. 1934 మార్చిలో ప్రథమాంధ్ర మహాసభకు మొట్టమొదటి వేదిక అందోల్ అయింది. గ్రంథాలయ ఉద్యమం, రజాకార్లకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశారు. కమ్యూనిస్టు యోధుడు మగ్ధూం మొహియొద్దీన్ పుట్టిన గడ్డ అందోల్. స్వాతంత్య్ర సమరయోధుడు మొట్టమొదటి స్థానిక ఎమ్మెల్యే బస్వమాణయ్యతోపాటు ఎందరో ఉద్యమకారులకు పుట్టినిల్లు. అందోల్ ప్రాంతంపై ఉద్యమనాయకుడు, సీఎం కేసీఆర్కు సైతం ఎంతో సాన్నిహిత్యం ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగూర్ నీటిని ఇక్కడి రైతులకు అందించారు.
అందోల్లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతారు. ఇప్పటివరకు ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరగ్గా ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో 13సార్లు అధికారం చేపట్టింది. ఎక్కువగా 8సార్లు కాంగ్రెస్, టీడీపీ నాలుగుసార్లు, బీఆర్ఎస్ రెండు సార్లు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. జోడు లింగాల రూపంలో కొలువైన జోగినాథుడి పేరుపూ జోగిపేట పట్టణంగా రూపాంతరం చెందిన జోగిపేట ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్య, రాజకీయాలకు చైతన్య వేదికగా మారింది. 2014, 18లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ను ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. రెండుసార్లు గులాబీ పార్టీకి పట్టంకట్టి కారుకు తిరుగులేదని నిరూపించారు. మరోసారి అందోల్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పురుషులకన్నా మహి ళలు ఎక్కువగా ఉండడం.. వారందరూ బీఆర్ఎస్ వైపే ఉండడం మరింత కలిసొచ్చే విషయం. అందోల్లో క్రాంతికిరణ్, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గెలవడం ఖాయమని అందోల్ ప్రజలు చెబుతున్నారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతోపాటు 9 మండలాల్లో అందోల్, వట్పల్లి, రాయికోడ్, పుల్కల్, చౌటకూర్, మునిపల్లి మండలాలు సంగారెడ్డి జిల్లాలో ఉండగా మెదక్ లో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ ఉన్నాయి.
ఇక్కడి నుంచి పోటీ చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యే బస్వ మాణయ్య మినహా అందరూ స్థానికేతరులే. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ 2018లో స్థానికుడైన చంటి క్రాంతికిరణ్కు టికెట్ కేటాయించగా 16,700 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవ్గంలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ రెండోస్థానంలో ఉన్నది. తాలెల్మ ఎత్తిపోతల పథకంతో 13వేల ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.300 కోట్ల్లు వెచ్చించింది. రూ.3.80 కోట్లతో పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు రూ.2.80 కోట్ల ప్రత్యేక నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులతో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. రూ.36.17 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్తో 13వేల ఎకరాలు సస్యశ్యామలం చేశారు. 1350 మంది లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు. దళితబంధుతో 100 కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారు. మన ఊరు-మనబడితో పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సకల సదుపాయాలతో గ్రంథాలయం నిర్మించారు. త్వరలో బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరందనుండడంతో రైతుల పంటలకు నీటి కష్టాలు తొలగనున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు మునిపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రానున్నది.
సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రత్యేక నిధులు రూ.50కోట్లతోపాటు మరో రూ.50 కోట్లతో మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించారు. రైతుబజార్ నిర్మాణం, రోడ్డుకు మధ్యలో డివైడర్లు నిర్మాణం చేపట్టి మొక్కలు నాటి లైట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృషితో మరమ్మతులు చేయడంతో చారిత్రక క్లాక్ టవర్కు పూర్వ వైభవం వచ్చింది. మినీ ట్యాంక్బండ్ నిర్మాణం, వాకింగ్ట్రాక్, ఓపెన్జిమ్, పిల్లలకు పార్కు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్రధాన రహదారి నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా సీసీ డ్రైనేజీ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పటివరకు వివిధ గ్రాంట్ల ద్వారా రూ.300 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పాడైపోయిన రోడ్ల నిర్మాణంతోపాటు కొత్తగా అవసరమున్న రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టారు. అందోల్-జోగిపేట మున్సిపల్తోపాటు అందోల్, వట్పల్లి, మునిపల్లి, రాయికోడ్, పుల్కల్, చౌటకూర్ మండలాల్లో రోడ్లు, ఇతర భవంతుల నిర్మాణాలు చేపట్టారు. ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో జీపీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.సీఎం కేసీఆర్ సంకల్పంతో 25 రైతు వేదికల నిర్మాణాలు జరిగాయి. వ్యవసాయానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతుండటంతో రైతులు, వ్యవసాయ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికీ రూ.20లక్షలు వెచ్చిస్తున్నారు. నియోజకవర్గంలోని అందోల్ 3, చౌటకూర్ 6, మునిపల్లి 3, పుల్కల్ 1, రాయికోడ్ 3, వట్పల్లి 3 మొత్తం 19 కొత్త పంచాయతీ భవనాలు నిర్మించనుండగా వాటికోసం రూ.3.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ భవనాలు పూర్తి చేస్తే పాలకవర్గాలకు సమీక్షా సమావేశాలకు ఇబ్బందులు తీరనున్నాయి.
పేదింటి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద 1350 మంది లబ్ధిదారులు సొంతింటి వారయ్యారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీ, అందోల్, మునిపల్లి, పుల్కల్ మండలాల్లో 1350 డబుల్ ఇండ్లను నిర్మించగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశారు. పుల్కల్, మునిపల్లి మండలాల్లో ఇండ్లను అందజేయగా అందోల్, అందోల్-జోగిపేట మున్సిపల్లో మంత్రి ప్రారంభించనున్నారు.
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధుతో నియోజకవర్గంలోని 100 దళిత కుటుంబాలకు మొదటి విడతలో మేలు చేకూరి వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. టేక్మాల్ మండలం అసద్మహ్మద్పల్లి 50, వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో 50 కుటంబాలను మొదటి విడుతలో ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికీ రూ.10 లక్షలు అందజేయగా వాటితో చిన్నతరహా పాడి పరిశ్రమ, ట్రాక్టర్లు, జేసీబీలు, టెంట్హౌస్లు, హోటళ్లు ఇతర వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
జోగిపేట పట్టణంలో 100 పడకల దవాఖాన ఉండగా అన్నిరకాల ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, దవాఖానలో కావాల్సిన వసతులుపై ఆరా తీస్తున్నారు. దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ కేంద్రం అందుబాటులో ఉన్నాయి. డయాలసిస్ కోసం ఈ ప్రాంత ప్రజలు సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్లాల్సిన తప్పింది.