‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. చౌటకూర్ మండలం సరాఫ్పల్లిలో శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెకు రూ.50లక్షల నుంచి రూ. కోటి వరకు నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, ఆరోగ్య మహిళ.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు. కాల్వలు ప్రజల కోసం తవ్వాలని, కమీషన్ల కోసం కాదని పరోక్షంగా మాజీ మంత్రి దామోదర రాజనర్సింహకు చురకలంటించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చౌటకూర్, మే 20: సీమాంధ్ర ప్రభుత్వాల కాలంలో గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుండేవని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గ్రామాల స్వరూపాన్ని మార్చిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం మండలంలోని సరాఫ్పల్లి శివారులోని పీపీఆర్ గార్డెన్లో మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ నాయకుడు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకు కార్యకర్తలు పార్టీ బలమని, నాయకుడికి బలమన్నారు. హైదరాబాద్లో ఉండేటోళ్లు మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, బాబూమోహన్కు గత ఎన్నికల్లో స్థానిక ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. స్థానిక నినాదంతో ప్రజల వద్దకు వచ్చిన తనకు స్థానికం అంటే ఏంటో చూపించారన్నారు. హైదరాబాద్లో ఉండి రాజకీయాలు చేయొద్దని మాజీ మంత్రులనుద్దేశించి ఎద్దేవా చేశారు. పైసల కోసం సింగూరు ప్రాజెక్టు కాలువలు తవ్వడం కాదు, ప్రజలు కోసం కాలువలు తవ్వాలన్నారు. మండలంలోని బొమ్మరెడ్డిగూడెం, ఉప్పరిగూడెంలలో ప్రజలు, రైతు కోసం తవ్వి కాలువలతో సాగు, తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు.
నాయకుడు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రజల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల బలంతో 21 ఏండ్లుగా పల్లెల్లో, గల్లీల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతుందన్నారు. బీఆర్ఎస్కు గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కార్యకర్తల బలం ఎంతో ఉందన్నారు. కులం, మతం ఏదీ లేదని, మన ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే సరిపోదని, అందుకు దేశం మొత్తం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ను తీసుకవచ్చినట్లు తెలిపారు. కేంద్ర బీజేపీ సర్కారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదన్నారు.
రెండు పర్యాయాలుగా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టి అధికారం కట్టబెట్టారని, మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, వారి కోసమే ఆ పార్టీ పుట్టిందని, అందుకే ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో ఏదో ఒక పథకం తప్పని సరిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుతున్నదని వివరించారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ ప్రజలు దేశంలో మార్పు తెస్తారన్నారు.
నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపై కలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. కార్యకర్తలమే నా బలం, నా బలగమన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తలే అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇవ్వొద్దని, మాజీ మంత్రులైన దామోదర రాజనర్సింహ, బాబూమోహన్లను ఇంటికి పంపి మాజీలుగానే ఉంచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు అధికారం లేక పదేండ్లు అయ్యిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దామోదరపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నో మాయమాటలు చెబుతారని, వారిని నమ్మొదన్నారు. గ్రామాలాభివృద్ధికి ప్రతి పల్లెకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ, పల్లెప్రకృతి, డంపింగ్ యార్డు వంటి వాటిని మంజూరు చేసి అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల జైపాల్ రెడ్డి
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ల మధ్య గ్రూపుల్లేవని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల జైపాల్రెడ్డి తేల్చి చెప్పారు. గ్రూపులు లేకుండా ఉండేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల ఆదేశాలతో క్రాంతికిరణ్కే మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ రావడం, 100 శాతం గెలువడం కూడా ఖాయమన్నారు. తాను పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని తెలిపారు.
– సీడీసీ డైరెక్టర్ జైపాల్ నాయక్
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం సంతోషకరమని సీడీసీ డైరెక్టర్ జైపాల్ నాయక్ తెలిపారు. అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృషి చేస్తున్నారన్నారు. అలాంటి నాయకుడి వెంట తామంతా ఉండి రాబోయేఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.