చేర్యాల, మార్చి 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆర్జ్జిత సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు సద్వినియోగం చేసుకోవడం లేదు. టీ-యాప్ పోలియోలో 12రకాల సేవా టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశమున్నది. అయిన్నప్పటికీ భక్తులు ఆలయానికి వచ్చి గంటల పాటు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఏడాదిలో మూడు నెలల సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో ఏ ఆలయంలో లేనివిధంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మూడు నెలల పాటు జరిగే ఉత్సవాలకు ప్రతి ఆదివారం 50వేల మందికి పైగా, ప్రతి బుధవారం 20వేల మందికి పైగా, మిగిలిన రోజుల్లో ప్రతి ఆదివారం 10వేలకు పైగా భక్తులు దర్శించుకుంటారు. సాంకేతికత పెరగడంతో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ఫోన్ ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. దేశంలో ప్రముఖ ఆలయాల్లో ఉన్న ఆన్లైన్ సేవల విధానాన్ని కొమురవెల్లిలో ప్రవేశపెట్టాలని గత దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ నిర్ణయించి రూపకల్పన చేయించారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు ఆర్జిత సేవలు, మొక్కుబడుల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి ఇంటి నుంచే ఆర్జిత సేవలు, మొక్కుబడి సేవల టికెట్లు పొందవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో బాలాజీ ప్రత్యేక శ్రద్ధ వహించి సేవలు టీ-యాప్ పోలియో యాప్లో నమోదు చేయించారు. టీ-యాప్ పోలియో ఓపెన్ చేస్తే ఎండోమెట్స్ రాగానే, అందులో రాష్ట్రంలోని ఆలయాల వివరాలు ఉంటాయి. అందులో కొమురవెల్లి మల్లన్న ఆలయ సేవల్లోకి వెళ్లి వాటిలో సేవలు నమోదు చేసుకోవచ్చు.