సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 26 : అమ్మ జన్మనిస్తే.. రక్తదానం పునర్జన్మనిస్తుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ మేరకు సీపీ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీస్ వీరులను ఈ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని, రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
శిబిరంలో 80 యూనిట్ల రక్తాన్ని సేకరించి సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన బ్లడ్ బ్యాంక్కు అందించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బం ది, వివిధ యువజన సంఘాల యువకులు, ప్రజాప్రతినిధులను అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మి న్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్, సతీశ్, ఫణీందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.