Telangana | సంగారెడ్డి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అంతర్గత సమస్యలతో సతమవుతున్నది. కీలకమైన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రూపు రాజకీయాలు కమలం పార్టీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ.. సంగారెడ్డి జిల్లాలో మాత్రం అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బీజేపీ అధిష్టానం వ్యవహార శైలితో కొందరు ముఖ్య నాయకులకు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మెదక్ ఎంపీ అభ్యర్థి వ్యవహారశైలి కొందరు నేతలకు మింగుడు పడడం లేదని తెలిసింది. గ్రూపు రాజకీయాలు, పార్టీ నేతల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఎన్నికల్లో చేటుచేస్తాయని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయనను పక్కనబెట్టి మరోనేతకు టికెట్ ఇచ్చింది. పార్టీ అధిష్టానం వైఖరి నచ్చని ఆ ముఖ్యనేత అప్పట్లో పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు కలుగజేసుకుని రాబోయే రోజుల్లో ఎంపీ టికెట్ ఇస్తామని నచ్చజెప్పడంతో సదరు నేత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా, బీజేపీ అధిష్టానం సదరు నేతకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఖిన్నుడైన ఆ ముఖ్యనేత ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన నందీశ్వర్గౌడ్ క్రియాశీలకంగా పనిచేయడం లేదని పార్టీ క్యాడర్ భావిస్తున్నది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన చురుగ్గా ఉండడం లేదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక ఓట్లు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన నందీశ్వర్గౌడ్ ఓటర్లను ప్రభావితం చేయగలరు. ఎంపీ ఎన్నికల ప్రక్రియల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. పార్టీ సైతం ఆయనకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు బీజేపీలో చర్చ నడుస్తున్నది. నందీశ్వర్గౌడ్ చురుగ్గా పనిచేస్తే ఎంపీ ఎన్నికల్లో పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది. కానీ, ఆయనకు ఎంపీ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అధిష్టానం ఇంకా అప్పగించకపోవడం పార్టీకి నష్టదాయకం అన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నది. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన అసంతృప్తితో కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన మరోనేత ఎడ్ల రమేశ్ పార్టీ తీరుతో అసంతృప్తితో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన ఆయనకు ఆ పదవి దక్కలేదు. దీంతో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని కొంతమంది ముఖ్య నాయకులను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరకపోవడంతో ఆ పార్టీ నేతలు మరింత అసంతృప్తికి లోనవుతున్నారు. అసలే అసంతృప్తితో ఉన్న నేతలు ఎంపీ అభ్యర్థి తీరు అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్లుగా మారింది. సంగారెడ్డి నియోజకవర్గంలోని ఓవర్గం నాయకులు ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశానికి కొంతమంది నాయకులు డుమ్మా కొట్టారు. ఎంపీ అభ్యర్థి తీరు కొంతమంది నాయకులకు మింగుడు పడడం లేదు. ఎంపీ అభ్యర్థి ఒంటెత్తు పోకడ పోతున్నారని, పార్టీ నేతలను అందరినీ కలుపుకొని ముందుకు పోవడం లేదన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతున్నది. కాగా, జిల్లాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై అధిష్టానం ఆరాతీసి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.