మెదక్ రూరల్, డిసెంబర్ 4 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సి ఉన్నది. 1960లో మొదలైన హరిత విప్లవం వల్ల విత్తన నాణ్యత పెరిగి దిగుబడి గణనీయంగా వచ్చింది. కానీ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువుల వాడకం, విచ్చల విడిగా పెరిగిపోయింది. దీంతో భూసారం తగ్గిపోయి లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మనుగడకు అవసరమైన భూ ఆరోగ్యన్ని కర్తవ్యంగా స్వీకరించాలనేది నిపుణుల మాట. నేలల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 2013 సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. మొదటి ప్రపంచ మట్టి దినోత్సవాన్ని 2014 డిసెంబర్ 5 ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని జరుపుకొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మట్టిపై అవగాహన పెంపొందించడానికి ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థ, మానవ సంక్షేమాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడం కోసం ఈ రోజును నిర్వహించాలి.
నేడు రైతు వైదికల్లో అవగాహన సదస్సులు
జిల్లాలో ఏఈవోలు క్లస్టర్ పరిధిలో గల రైతు వైదికల్లో రైతులకు నేల సంరక్షణ, నేల సారాన్ని పెంపొందించడానికి పాటించవలిసిన పద్ధతులు, మట్టి నమూనా సేకరణ అవశ్యకత గురించి అవగాహనతో పాటు మట్టినమూనా పరీక్షఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం తీసుకోవాల్సిన పద్ధతుల గురించి రైతులకు అవగాహన కార్యక్రమలు ఉంటాయని వ్యవసాయాధికారులు తెలిపారు.
అశాస్త్రీయ పద్ధ్దతుల్లో సాగుతో భూమి నిస్సారం
అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుకొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవ సమూహంలోని వ్యత్యాసాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలల్లో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్ వైశాల్యంలోని మంచినేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యనికి కారణమవుతున్నాయి. కర్బన సమ్మేళనాలను వినియోగించుకొని పర్యవరణాన్ని కాపాడుతున్నాయి.
నేలల పరిరక్షణ అందరి బాధ్యత
అధిక దిగుబడులు సాధించాలనే ఏకైక లక్ష్యంతో రైతులు మోతాదుకు మించి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నేల సారం తగ్గిపోతున్నది. చీడ, పీడల ఉధృతి పెరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరూ నేల పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలి.
-విజయనిర్మల, సహాయ వ్యవసాయసంచాలకులు, మెదక్
పచ్చిరొట్ట ఎరువులు వాడాలి
పీఏసీఎస్ కార్యాలయంలో పచ్చిరొట్ట ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. కనుక సరి చేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలి. దీని వల్లన ఖర్చు తగ్గించమేకాకుండా నేలను పరిరక్షించవచ్చు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు రైతులు వాడాలని సూచించారు. భవిష్యత తరాల మనుగడ కోసం భూమాతను చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి ప్రసాదించిన నేలను సంరక్షించుకునేందుకు ముఖ్యంగా రైతులు కార్యోన్ముఖులు కావాలి.
-హన్మంత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, మెదక్
నేలల ఆరోగ్యన్ని సంరక్షించేందుకు..
సేంద్రియ ఎరువులు జీవ సంబంధ పురుగుమందులు పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించాలి. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ కొండ ప్రాంతాల్లోని పోడు వ్యవసాయ పద్ధతి నియంత్రించాలి. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేపట్టాలి, భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులను వాడలి. చీడ, పీడల యాజమాన్యం చేపట్టాలి, విత్తనానికి అవసరమైన చోట మాత్రమే దుక్కి చేయాలి. నేలను కప్పి ఉంచే పద్ధ్దతిని అనుసరించాలి. పంటమార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంటలు, సాగు విధానాల కొనసాగింపుతో నేత కోతను అరికట్టవచ్చు. వ్యవసాయ పంటలు, అటవీ మొక్కలను సంయుక్తంగా ఒకే పొలంలో సాగు చేయడాన్ని వ్యవసాయ అటవీ సంయుక్త పద్ధ్దతిగా చెప్పుకోవచ్చు. దీంతో నివాసాలకు అవసరమైన కలప, పశుగ్రాసం వంటి ఉత్పత్తులు సుస్థిరమైన రీతిలో సమకురుతాయి.